విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. టిఆర్ఎస్ నేత నాగేందర్ మృతి
ఖమ్మం: జిల్లాలోని దమ్మపేట మండల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు తాటి నాగేందర్(42) అనారోగ్యంతో సోమవారం అర్ధరాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందారు. ఈయన గత కొద్ది కాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.
కాగా, నాగేందర్ 2000-2009 మద్య ప్రభుత్వ ఉపాధ్యాయునిగా అశ్వరావుపేటలో పనిచేశారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం టిఆర్ఎస్లో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.
నాగేందర్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు.
చెట్టు నరుకుతుండగా కరెంటు స్తంభం కూలి వ్యక్తి మృతి
చెట్టు నరకుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు స్తంభం విరిగి మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నేలకొండపల్లి మండలంలోని ముజ్జుగూడెంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ చాంద్మియా(50) తన తోటి కూలీతో కలిసి చెట్లు నరికేందుకు గ్రామ సర్పంచ్ ఐతనబోయిన వీరమణికి కూలీ పనికి వెళ్లాడు.
చాంద్మియా చెట్టు కింద మండలు నరుకుతుండగా తనతో పాటు కూలికి వచ్చిన వేరే వ్యక్తి చెట్టుపైకి ఎక్కి మండలు కొడుతున్న క్రమంలో పెద్ద మండ విరిగి పక్కనే ఉన్న కరెంటు స్తంభంపై పడటంతో స్తంభం విరిగి సమీపంలో ఉన్న చాంద్మియా మీద పడింది. తలకు బలమైన గాయం కావడంతో అతన్ని గ్రామస్తులు నేలకొండపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చాంద్మియా మృతి చెందినట్లు నిర్ధారించారు.