కథ కాదు: భర్తను రోకలిబండతో మోది..13వ అంతస్తు నుంచి దూకేసింది
హైదరాబాద్: సుమారు నాలుగేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు విముక్తి కల్పించాలనుకుంది ఓ మహిళ. ఇక ఏమీ ఆలోచించకుండా ఐద దశాబ్దాలపాటు కాపురం చేసిన భర్తను రోకలిబండతో బాదేసింది. ఆ తర్వాత తీవ్రంగా గాపడిన తన భర్త చనిపోయాడనుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకుంది 13 అంతస్తుల భవనంపై నుంచి దూకి. ఈ విషాద ఘటన నగరంలోని మియాపూర్లో చోటు చేసుకుంది.
అయితే, తీవ్రంగా గాయపడిన ఆమె భర్త ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజమండ్రికి చెందిన మురళీకృష్ణ (65) ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యారు. అయితే, అతను గత నాలుగు సంవత్సరాలుగా పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు భార్య వెంకట సాయిలక్ష్మి (56), కుమారులు గణేశ్, ఓంకార్ ఉన్నారు. ప్రవైటు ఉద్యోగం గణేష్, ఓంకార్లకు ఇంకా వివాహం కాలేదు.
కాగా, మురళీకృష్ణ నాలుగేళ్లుగా శరీరంలోని అవయవాలు సరిగా పనిచేయకపోవడంతో మంచానికే పరిమితమయ్యారు. భార్య వెంకట సాయిలక్ష్మి అన్నీ తానై భర్తకు సపర్యలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో భర్త అలాంటి పరిస్థితిలో ఉండటం భరించలేక పోయింది. తీవ్ర మానసిక వేదనకు గురై.. రెండేళ్లుగా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. తామిద్దరం కలిసి చనిపోతామంటూ కుమారులు, బంధువులతో అప్పుడప్పుడూ చెబుతూ ఉండేది.
గతంలో ఓసారి ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుందంటూ కుమారులు ఆమెకు నచ్చజెప్పారు. అప్పటి నుంచి కొంతకాలం బాగానే ఉన్న సాయిలక్ష్మి.. భర్తకు వ్యాధి నయం కాకపోవడంతో ఆయనను చంపి, తనూ చనిపోవాలని నిర్ణయించుకుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుర్చీలో కూర్చొని ఉన్న భర్త తలపై రోకలిబండతో గట్టిగా మోదింది. దీంతో మురళీకృష్ణ తలపై తీవ్రగాయమై అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తన భర్త మరణించాడనుకున్న సాయిలక్ష్మి... తాము ఉండే 13వ అంతస్తు నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
గమనించిన అపార్ట్మెంట్ వాసులు, స్థానికులు.. బాధితుల కుమారులకు సమాచారమిచ్చారు. తీవ్ర గాయాలైన మురళీకృష్ణను దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.