భర్త, మాజీ ప్రియుడితో కలిసి 12ఇళ్లు దోచేసిన కిలేడీ!: రూ. 11 లక్షల ఆస్తి సీజ్
కరీంనగర్: కట్టుకున్న భర్త, మాజీ ప్రియుడితో కలిసి 12 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన ఓ కిలాడీ లేడీతోపాటు వారిని సోమవారం అరెస్ట్ చేశారు జిల్లాలోని పెద్దపల్లి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్కు చెందిన భార్యాభర్తలు దయ్యాల భాగ్యలక్ష్మి, శంకర్, భాగ్యలక్ష్మి మాజీ ప్రియుడు సిరిగిరి సమ్మయ్య కలిసి ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో 12 ఇళ్లలో చోరీలు చేశారు.
పెద్దపల్లి సీఐ మహేష్, ఎస్సై రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఈ ముగ్గురినీ స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.10.5 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు ఆభరణాలు, 210 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నల్ల మల్లారెడ్డి తెలిపారు.
పెద్దపల్లి పట్టణంలోని ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడిన ఈ ముగ్గురు పగలు నాలుగు ఇళ్లలో, రాత్రి రెండు ఇళల్లో దొంగతనం చేశారని పేర్కొన్నారు. భాగ్యలక్ష్మి పొద్దంతా తిరిగి తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి మాజీ ప్రియుడు, భర్తకు చెబుతుంది. వారు రాత్రి వెళ్లి ఆ ఇళ్లలో చోరీ చేస్తారని వివరించారు.
ఇదే పద్దతిలో సుల్తానాబాద్లో కూడా రెండు ఇళ్లను, ధర్మారంలో ఒక ఇంట్లో పగలే దొంగతనం చేశారని చెప్పారు. బసంత్నగర్, కరీంనగర్ రూరల్, కరీంనగర్ పట్టణంలోని మొ12 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు వివరించారు. వీరి నుంచి రూ. 10.50లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకుని, కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు దొంగలను పట్టుకుని సొత్తు రికవరీ చేసిన పోలీసులను డీఎస్పీ మల్లారెడ్డి అభినందించారు.