ట్రయాంగిల్ లవ్: భర్తను వదిలి, లవర్తో సహజీవనం, చివరికిలా...
హైదరాబాద్: భర్తను వదిలేసి మామ కొడుకుతో సహజీవనం.. కొంత కాలంగా సజావుగానే సాగింది. అయితే మామ కొడుకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు. కట్టుకొన్న భర్తను వదిలి రావడం, సహజీవనం చేసిన మామ కొడుకు దూరం కావడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైద్రాబాద్లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్లోని నారాయణగూడ పీఎస్ పరిధిలోని విక్రమ్నగర్లో మంజుల అలియాస్ సుష్మ అనే వివాహిత బుదవారంనాడు ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన మంజుల అలియాస్ సుష్మ(23) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో బంధువుల ఇంట్లో పెరిగింది.
కడపజిల్లా బద్వేల్కు చెందిన నాగేంద్రతో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమకు దారితీయడంతో 2009లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. నగరంలోని ఓ హోటల్లో నాగేంద్ర సూపర్వేజర్గా పనిచేస్తుండడంతో కొన్నాళ్లపాటు ఇక్కడే ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.

మూడేళ్ల క్రితం విడిపోయి విడిగా ఉంటున్నారు. పెద్దపాపను భర్తతో పంపించిన మంజుల చిన్నపాపను తీసుకుని జడ్చర్లలో బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. మంజులకు మేనమామ కుమారుడు రామలింగేశ్వర్తో చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది.
రామలింగేశ్వర్ కారుడ్రేవర్గా పనిచేస్తూ, వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. మంజులను పెళ్లిచేసుకుంటానని నమ్మించి నగరానికి తీసుకువచ్చాడు. నారాయణగూడ పీఎస్ పరిధిలోని విక్రమ్నగర్లో కాపురం పెట్టాడు. కొన్ని రోజుల తర్వాత చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడు. ఫోన్లో పలుమార్లు రామలింగేశ్వర్తో మాట్లాడిన మంజుల తనవద్దకు రావాలని ప్రాధేయపడింది.
మంగళవారం అతడు ఇంటికి రాగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. మనస్తాపం చెందిన ఆమె బుధవారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుంది. రామలింగేశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని నారాయణగూడ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications