వేధింపులతో యువతి సూసైడ్: ఎంటెక్విద్యార్థి ప్రాణం తీసిన గుంత
హైదరాబాద్: జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని రోడ్లు.. యమపాశాలుగా మారుతున్నాయి. రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చని కారణంగా ఇప్పటికే సుమారు 8మంది చనిపోగా.. శుక్రవారం మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ ఎస్ఎస్కాలనీకి చెందిన అరుణకుమార్(25) ఎంటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హఫీజ్పేట నివాసి సోమశేఖర్(32)తో కలిసి ద్విచక్రవాహనంపై మూసాపేట వైపు వెళ్తున్నాడు. కూకట్పల్లి వై జంక్షన్ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కిందపడ్డారు.
ఈ ప్రమాదంలో బైక్పై వెనుక కూర్చున్న అరుణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, సోమశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న గుంతలే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేధింపులు తాళలేక విద్యార్థిని ఆత్మహత్య
జయశంకర్ జిల్లా ములుగులో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోకిరి వేధింపులు తాళలేక కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఏడాదిగా రమ్య అనే యువతిని అమర్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేస్తున్నాడు.
కాగా, అమర్కి ఇప్పటికే వివాహం జరిగింది. అయినా రమ్య వెంట పడుతున్నాడు. దీంతో అతని వేధింపులు భరించలేక.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్న రమ్య నిప్పటించుకుంది. గమనించిన ఇరుగుపొరుగు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమ్య మృతి చెందింది. తన మరణానికి అమర్ కారణమని, తనను అతడు వేధిస్తున్నాడని మరణవాంగ్మూలంలో రమ్య తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.