స్నేహితుడి చెల్లెలికి వేధింపులు: ప్రశ్నించిన యువకుడిని చంపేశారు
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేటలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి చెల్లెలిని కొందరు వేధిస్తుండడంతో.. ప్రశ్నించేందుకు వెళ్లిన ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేటని గౌండ్ల బజార్కు చెందిన మాందాస్ లక్ష్మి-సాయిలు కుమారుడు ఉపేందర్(21) కిరాణం దుకాణంలో గుమస్తాగా పని చేస్తున్నాడు. అయితే, ఆదివారం దుకాణానికి సెలవు కావడంతో ఇంటి వద్దనే ఉన్నాడు. కాగా, అదే వీధికి చెందిన తన స్నేహితుడు నాగరాజు చెల్లెల్ని పీఎస్సార్ సెంటర్, రాజీవ్నగర్ (బర్లపెంట బజార్)కు చెందిన కొందరు యువకులు వేధిస్తున్నారు.
ఈ విషయాన్ని ఇంటి వద్ద ఉన్న ఉపేందర్కు చెప్పి అతడితోపాటు మరో నలుగురు స్నేహితులను తీసుకొని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల శివాలయం వద్దకు చేరుకున్నా రు. అప్పటికే శివాలయం వద్ద ఉన్న వేధింపులకు పాల్పడిన యువకులు వెంటనే వీరిపై దాడికి దిగారు.
ఇరువర్గాల యువకుల మధ్య పెనుగులాట జరిగింది. దీని నుంచి తేరుకున్న నాగరాజు, స్నేహితులు అక్కడి నుంచి పారిపోగా ఉపేందర్పై అప్పటికే పిడిగుద్దుల వర్షం కురిపించడంతో కింద పడిపోయాడు.
ఇదే క్రమంలో వేధింపులకు పాల్పడుతున్న యువకుల్లో ఒకరు శివాలయానికి సమీపంలో గల బార్బర్ దుకాణంలోని కత్తెరను తెచ్చి, సొమ్మసిల్లి కిందపడిపోయిన ఉపేందర్ గుండెల్లోకి పొడిచాడు. దీంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.