బిత్తిరి సత్తిపై దాడి: వీ6 ఆఫీసు ముందే, నిందితుడు ఏమన్నాడంటే?
Recommended Video
హైదరాబాద్: వీ6 ఛానల్లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలంటే అందరికీ బిత్తిరి సత్తే గుర్తుకు వస్తాడు. కాగా, తాజాగా, ఆయనపై వీ6 ఆఫీసు ముందే దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. సత్తిపై దాడి చేసిన వ్యక్తిని చితకబాదారు.
ఆస్పత్రికి బిత్తిరి సత్తి
మణికంఠ అనే వ్యక్తి చేతిలో దాడికి గురైన బిత్తిరి సత్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వీ6 యాజమాన్యం స్పందించింది. దాడికి పాల్పడిన వ్యక్తి గురించి ఇప్పటికే ఆరా తీసినట్లు తెలిసింది.
దాడి ఎందుకు చేశానంటే..
ఓ మెంటల్ కేరక్టర్ సత్తితో తెలంగాణ భాషను అపహాస్యం చేస్తూ.. వీ6 ఛానెల్ భాషను అవమాన పరుస్తున్నదనే తాను సత్తిపై దాడి చేశానని సత్తిపై దాడికి పాల్పడిన మణికంఠ అనే వ్యక్తి చెప్పాడు. ఎంతో కాలంగా సత్తిపై దాడి చేయడానికి వెయిట్ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేగాక, తనకు సినిమాలపై ఆసక్తి ఉందని, తాను కాబోయే దర్శకుడినని చెబుతుండటం గమనార్హం.
అవమానించాడు..
అంతేగాక, తాను మాస్ కమ్యూనికేషన్ చేశానని, సికింద్రాబాద్లోనే సొంత ఇల్లు ఉందని చెప్పుకొచ్చాడు. తెలంగాణ భాషను అవమానించినందుకే దాడి చేశానని స్పష్టం చేశాడు. ఉదయం 12.30గంటలకు వీ6 ఆఫీసు ముందుకు వచ్చానని, బిత్తిరి సత్తి రాగానే.. ఎవరి గురించి మాట్లాడుతున్నవ్ రా అంటూ దాడి చేశానని తెలిపాడు.
గాంధీ తాతను కాదు..
వీ6 సిబ్బంది కూడా తనపై దాడి చేశారని చెప్పారు. ఎట్లపడితే అట్ల మాట్లడితే తాను గాంధీ తాత లెక్క ఉండనని, తాను ఒక్కడినే ఇక్కడికి వచ్చానని తెలిపాడు. తాను ఎప్పట్నుంచో సత్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. ఇక్కడికి ఇంతకుముందు కూడా వచ్చినట్లు చెప్పిన మణికంఠ.. బిత్తిరి సత్తిని మాత్రం కలవలేదని చెప్పాడు. కాగా, నిందితుడ్ని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.