కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్ తో ప్రతి గడపకు ఆప్ న్యాయపాదయాత్ర.. టార్గెట్ కేసీఆర్!!
తెలంగాణ రాష్ట్రం పై ఆమ్ ఆద్మీ పార్టీ ఫోకస్ పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 14 నుండి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సీఎం కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తోంది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జి సోమనాథ్ భారతి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతుందో ఆయన వెల్లడించారు.
కేసీఆర్ అవినీతి గురించి చిన్నపిల్లలను అడిగినా చెప్తారు: ఆప్ నేత
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సోమ్నాథ్ భారతి ఢిల్లీ ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో విజయం తర్వాత తమ పార్టీ దేశవ్యాప్త విస్తరణపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతుందని సోమ్నాథ్ భారతి వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి గురించి రాష్ట్రంలో చిన్నపిల్లలను అడిగినా చెబుతారని పేర్కొన్న ఆయన, జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరబోదని సోమనాథ్ భారతి స్పష్టం చేశారు.
ఏప్రిల్ 14 నుండి ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయ పాదయాత్ర
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని న్యాయ పాదయాత్రను చేపట్టనున్నట్టు ఆమాద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతి వెల్లడించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాలలో ఆప్ కార్యాలయాలను ప్రారంభించి జెండాలను ఆవిష్కరించారు. ఢిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగు పెడుతున్న కేజ్రీవాల్ ను అక్కున చేర్చుకుని, ఆదరించాలని సోమ్నాథ్ భారతి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణా రాష్ట్రంలో ప్రతి గడపకూ వెళ్తాం
కేజ్రీవాల్ మోడల్ గవర్నెన్స్ తో తాము తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికలకు వెళతామని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కేజ్రీవాల్ అమలు చేశారని, కేజ్రీవాల్ పై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పటికీ పంజాబ్ ఎన్నికలలో ప్రజలు కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆదరించారని సోమ్నాథ్ భారతి వెల్లడించారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళతామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన లేదు
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని సోమ్నాథ్ భారతి వెల్లడించారు. 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయడం లేదని, కానీ తాము 12 లక్షల ఉద్యోగాలు కల్పించామని సోమనాథ్ భారతి పేర్కొన్నారు. ఇక దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటూ మోడీ సర్కార్ పై మండిపడ్డారు.
అవినీతి రహిత పాలన అందించే ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలి
ఢిల్లీలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భయపడుతుందని, కేజ్రీవాల్ కు బిజెపి ఎంతగా భయపడుతోందో దీన్నిబట్టి అర్థం అవుతుందని సోమనాథ్ భారతి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోడీ ఖూనీ చేస్తున్నారని పేర్కొన్న ఆయన మోడీ కాకపోతే కేజ్రీవాల్ అనే స్థితికి వచ్చామని వెల్లడించారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కేసీఆర్ అవినీతి పాలనపై ప్రజలు అసహనంతో ఉన్నారని, అవినీతి రహిత పాలన అందించే ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరించాలని సోమనాథ్ భారతి విజ్ఞప్తి చేశారు.