రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న దుబాయ్ కంపెనీ
దుబాయ్/హైదరాబాద్: లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ దుబాయ్లో ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావును కలిశారు. వచ్చే ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో రూ.2500 కోట్లు పెట్టుబడి పెడతామని లూలూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ మంత్రి కెటిఆర్కు స్పష్టం చేశారు.
అదే విధంగా రాష్ట్రంలో మూడు ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలని లూలూ భావిస్తోంది. ఇందులో మొదటిది కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్, రెండవది సమీకృత మాంసం ప్రాసెసింగ్ యూనిట్, మూడవది హైదరాబాద్లో షాపింగ్మాల్ ఏర్పాటు యోచనలో పెట్టుబడులు పెట్టడానికి లూలూ గ్రూప్ సిద్ధంగా ఉన్నట్టు ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ స్పష్టం చేశారు.
మూడు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర నివేదికలను ప్రభుత్వం ముందు ఉంచేందుకు జనవరి మొదట్లో హైదరాబాద్కు తమ ప్రతినిధి బృందం వస్తుందని యూసుఫ్ అలీ తెలిపారు. కాగా, లూలూ గ్రూప్ దుబాయ్లో హైపర్ మార్కెట్స్ను నిర్వహిస్తోంది.
ఇది ఇలా ఉండగా అంతకుముందు జరిగిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వేధింపులకు ఆస్కారంలేని పారదర్శక, అవినీతిరహిత పారిశ్రామిక విధానాన్ని తెచ్చామని ఆయన వివరించారు. పెట్టుబడులకు రెడ్కార్పెట్ వేస్తున్నామని.. ప్రభుత్వపరంగా అన్ని విధాలా తోడ్పాటునందిస్తాం అని తారకరామారావు అక్కడి కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.