థర్డ్ డిగ్రీ వద్దు: సండ్ర కస్టడీపై ఏసీబీ కోర్టు, ఏసీబీ కార్యాలయానికి తరలింపు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం ఏసీబీ కోర్టు ఉత్తర్వుల మేరకు చర్లపల్లి జైలులో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ అధికారులు ఈరోజు, రేపు ప్రశ్నించనున్నారు.
కస్టడీ సందర్భంగా ఏసీబీ అధికారులు వ్వవహరించాల్సిన తీరుపై బుధవారం కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సండ్ర వెంకట వీరయ్య ప్రజాప్రతినిధి కాబట్టి థర్డ్ డిగ్రీ లాంటి ప్రయోగాలు చేయవద్దని న్యాయమూర్తి షరతు విధించారు.
అంతేకాదు ఎమ్మెల్యే సండ్రను ఆయన తరపు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, ఆయన ఆరోగ్యం బాగా లేదు కాబట్టి విచారణ సందర్భంగా వైద్యుడిని అందుబాటులో ఉంచుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, శుక్రవారం ఉదయం 9 నుంచి 4.30 వరకు ప్రశ్నించవచ్చుని, ఈ సమయంలో వేధింపులకు గురి చేయకుండా ఉండాలని సూచించారు. జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న సండ్రను ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు.
కస్టడీ అక్కర్లేదని సండ్ర వీరయ్య తరఫు న్యాయవాది కె.రవీంద్రకుమార్ వాదించారు. చివరకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను రెండు రోజుల ఏసీబీ కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సండ్రకు తొలుత సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇస్తే విచారణకు హాజరుకాలేదు.
రెండోసారి సెక్షన్ 41(ఏ) కింద ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఓటుకు నోటు కేసులో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు? అనేదానిపైనే సండ్రను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.