స్నానం చేసే బకెట్లో యాసిడ్!: ఇక్ఫాయి వర్సిటీలో విద్యార్థినికి తీవ్రగాయాలు
హైదరాబాద్: నగరంలోని ఇక్ఫాయి(ICFAI) యూనివర్సిటీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్ఫాయి యూనివర్సిటీ హాస్టల్లో బీటెక్ విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె స్నానం చేసే బకెట్లో తోటి విద్యార్థులే యాసిడ్ పోశారు. దీంతో ఆ నీళ్లతోనే స్నానం చేయడంతో తీవ్రంగా లేఖ్య తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇక్ఫాయి యూనివర్సిటీకి చెందిన హాస్టల్లో ఉంటున్న లేఖ్య.. ఎప్పటిలాగే గురువారం ఉదయం స్నానం చేసేందుకు వెళ్లింది. అయితే స్నానం చేసే బకెట్లో అప్పటికే కొందరు ఆగంతకులు యాసిడ్ పోశారు. ఈ విషయం తెలియని లేఖ్య.. బకెట్లో ఉన్నవి నీళ్లే అనుకుని వాటినే ఒంటిపై పోసుకుంది.

ఒక్కసారిగా యాసిడ్ ఒంటి మీద పడటంతో భరించలేని మంటతో ఆ విద్యార్థిని గట్టిగా అరిచింది. విద్యార్థిని కేకలతో తోటి విద్యార్థినులు వాష్రూమ్ దగ్గరికి వెళ్లి చూడగా.. అసలు విషయం తెలిసింది. దీంతో వాళ్లు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఒళ్లంతా గాయాలతో తల్లడిల్లిపోతున్న సదరు విద్యార్థినిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.
యాసిడ్ దాడి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అసలు విద్యార్థినిపై ఎవరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు.
దీని వెనుక ఉన్న కారణాలు ఏమై ఉంటాయనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. యాసిడ్ దాడి జరిగిందా? లేక వేడి నీటి వల్ల ఇది జరిగిందా? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, యాసిడ్ దాడితో యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడికి నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications