సిసలైన నాయకుడికి సెల్యూట్.. కేసీఆర్కు నటుడు సోనుసూద్ ప్రశంసలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు.. ముఖ్యంగా రైతన్నలకు,వలస జీవులకు ఆయన భరోసా ఇచ్చిన తీరు అందరి చేత భేష్ అనిపించుకుంటోంది. ఆదివారం(మార్చి 29) సాయంత్రం ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఎంతోమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. పలువురు కేసీఆర్ వ్యతిరేకులు సైతం.. ఇలాంటి సంక్షోభ సమయంలో ఆయన ముందుచూపు,నిర్ణయాలు బాగున్నాయని వ్యాఖ్యానించారు.
తాజాగా నటుడు సోనుసూద్ కూడా కేసీఆర్పై ప్రశంసలు గుప్పించారు. 'అసలైన నాయకుడు.. సెల్యూట్..' అంటూ ట్విట్టర్లో కేసీఆర్ ప్రెస్ మీట్ వీడియోను పోస్టు చేశారు. బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చినవారిని.. ఇక్కడి ప్రజలతో సమానంగా కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ అందులో చెప్పారు. అంతేకాదు,వారిని వలస కూలీలుగా చూడటం లేదని.. తెలంగాణ అభివృద్దిలో పాలుపంచుకుంటున్న ప్రతినిధులుగా వారిని చూస్తున్నామని చెప్పారు. ఇక్కడి ప్రజలతో సమానంగా ఒక్కొక్కరికి 12కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమ పిండి పంపిణీ చేస్తామన్నారు. అంతేకాదు,ఒక్కొక్కరికి రూ.500తో పాటు ఉచిత విద్యుత్,ఉచిత్ నీరు అందిస్తామన్నారు.

కరోనా వైరస్తో జనం అల్లాడుతున్నవేళ.. రేషన్ పంపిణీలోనూ కక్కుర్తిపడే డీలర్లకు కరోనా రావాలని ఆయన శాపం పెట్టడం గమనార్హం. ఇలాంటి సమయంలో ప్రజలను పీడించుకు తినడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. ఇందుకోసం వారికి కూపన్లు సప్లై చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వద్ద డబ్బు కొరత ఉన్నప్పటికీ రూ.30వేల కోట్లు ధాన్యం కొనుగోలుకే వెచ్చించనున్నామని తెలిపారు. ఎవరైనా ప్రైవేట్ వ్యాపారులు రైతులు వద్ద నుంచి కొనుగోలు చేయదలుచుకుంటే చేయవచ్చునని.. ప్రభుత్వం అభ్యంతరం చెప్పదని అన్నారు. అయితే రైతులకు కనీస గిట్టుబాటు ధర చెల్లించాలన్నారు.కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని.. అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.
True leader👏👏👏👏 salute 🇮🇳 @TelanganaCMO @KTRTRS pic.twitter.com/5HQ2ZJ8iPW
— sonu sood (@SonuSood) March 30, 2020












Click it and Unblock the Notifications