పెన్డ్రైవ్ మోసమని నటి ఫిర్యాదు: ఫ్రెండ్స్ బుక్ హీరోకి రిమాండ్
హైదరాబాద్: పెన్డ్రైవ్ తీసుకుని ఇవ్వడం లేదని సినీనటి రాధాప్రశాంతి ఓ వ్యక్తిపై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్కు చెందిన రాధాప్రశాంతికి దిల్సుఖ్నగర్లో నివసించే ఆక్యుపంక్చర్ థెరపిస్ట్ జగదీశ్ సోషల్ మిడియాలో పరిచయమయ్యాడు.
రాధాప్రశాంతి తన చిత్ర జీవితానికి సంబంధించిన పేజీలను ఫేస్బుక్లో ప్రత్యేకంగా రూపొందించాలంటూ అతనికి సూచించారు. అందుకు సమ్మతించిన జగదీశ్ రెండుసార్లు ఆమె ఇంటికి రాగా వివరాలను పెన్డ్రైవ్లో పెట్టి అందించారు. పెన్డ్రైవ్ తీసుకున్న జగదీశ్ను అడితే లేదంటున్నాడని ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జగదీష్ను పిలిచి విచారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, హోటల్ దసపల్లాలోని పబ్పై బుధవారం దాడి చేసిన 'ఫ్రెండ్స్ బుక్' హీరో ఉదయ్కిరణ్ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం రిమాండ్కు తరలించారు. పబ్లో జరిగిన గొడవలో కార్ల అద్దాలు ధ్వంసం చేయగా నిర్వాహకులు అతనిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషనులో కేసు నమోదు చేశారు.
శనివారం సాయత్రమే నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా పోలీసు స్టేషన్లోనూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనల నేపథ్యంలో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాగా ఉదయ్కిరణ్ గతంలో చేసిన వివిధ మోసాలపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు తాము కస్టడీకీ కోరుతామని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి తెలిపారు.
సినిమా అవకాశాలు వస్తాయని నమ్మించి...
సినిమా అవకాశాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై శుక్రవారం ఒకరు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ వెలిశాల(33) సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చాడు. తెలంగాణ సినిమా అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ యూనియన్ కార్యదర్శిగా ఠాగూర్ అనే వ్యక్తి శ్రీనివాస్ను పరిచయం చేసుకున్నారు.
యూనియన్లో సభ్యత్వం తీసుకొంటే అవకాశాలు వస్తాయని నమ్మించాడు. శ్రీనివాస్ దాదాపు రూ.1.5లక్షలు తీసుకొచ్చి సభ్యత్వం తీసుకున్నారు. శ్రీనివాస్ ఎక్కడికి వెళ్లినా సభ్యత్వం పనిచేయదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో ఠాగూర్ను నిలదీసి, తన డబ్బులు తనకివ్వాలంటూ కోరాడు. నిరాకరించడంతో శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.