హరీశ్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ అదనపు బాధ్యతలు: ఈటల బర్తరఫ్ తర్వాత కీలక పరిణామం
హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు మరో శాఖ అదనంగా వచ్చి చేరింది. ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్ రావుకు అదనంగా వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు అప్పగించారు సీఎం కేసీఆర్. దీంతో హరీశ్ రావు వైద్యారోగ్య శాఖ బాధ్యతలు కూడా నిర్వహించనున్నారు.

హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ అదనపు బాధ్యతలు
గతంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. వైద్యారోగ్యశాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా, వైద్యారోగ్యశాఖ బాధ్యతలను కూడా హరీశ్ రావుకు అప్పగించారు. హరీశ్ రావుకు అదనంగా వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతకం చేశారు. ఇప్పటి వరకు హరీశ్ రావు ఆర్థిక శాఖను మాత్రమే పర్యవేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈటల బర్తరఫ్ తర్వాత కేసీఆర్ రంగంలోకి..
కాగా, కరోనా సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా వైద్యారోగ్య శాఖను పర్యవేక్షించారు. ఆరోగ్య రంగం, కరోనా పరిస్థితులు, వసతులు తదితర అన్ని అంశాలపై అధికారులతో పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. కరోనా పరిస్థితులను నిత్యం గమనిస్తూ అధికారులకు సూచనలు చేశారు. అంతేగాక, గాంధీ ఆస్పత్రి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి వసతులను పరిశీలించారు.

కేసీఆర్ ఆదేశాలతో హరీశ్ రావు వైద్యారోగ్యశాఖ బాధ్యతలు
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీష్ రావు వైద్యారోగ్య శాఖకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టారు. కరోనా కట్టడి చర్యలు, ఔషధాలు సమకూర్చుకోవడం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సరఫరా, ఇతర మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై పలుమార్లు వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులతో సమీక్షలు జరుపుతూ అవసరమైన సూచనలు చేశారు. వ్యాక్సిన్ల కొరత లేకుండా ఉండేందుకు రాష్ట్రానికి ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్లు కేటాయించాలని కోరేలా అధికారులకు సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి నెల వారీ లక్ష్యాన్ని నిర్దేశించి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా కృషి చేశారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిన సందర్భంలో స్వయంగా కోఠిలోని ఇఎన్టీ ఆసుపత్రి సందర్శించి, అక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. కరోనా కట్టడి చర్యలు పకడ్బందీగా అమలు చేయడంలో, బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారికి సకాలంలో చికిత్స అందించడంలో ఎంతో కృషి చేశారు. ఈ నేపథ్యంలో హరీష్రావుకే వైద్యారోగ్య శాఖను కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం.

రేపు ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ఇటీవల హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఈసారి బీజేపీ సభ్యుడిగా ఈటల రాజేందర్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.












Click it and Unblock the Notifications