ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెన్ -జగన్ వల్ల కానిది కేటీఆర్ సాధించేనా? -మోదీకి వినతి, కీలక సమీక్ష
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) యూనిట్ను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ పరిశ్రమల 1996 నుండి మూసివేయబడింది. గురువారం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై గతంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించినప్పటికీ ఎటువంటి పురోభివృద్ధి లేదన్నారు.
772 ఎకరాల్లో సిమెంట్ ప్లాంట్
ఆదిలాబాద్లోని సీసీఐ యూనిట్ 1984 లో రూ.47 కోట్ల పెట్టుబడితో వ్యయంతో ప్రారంభమైంది. ఈ ప్లాంట్ ఆదిలాబాద్ పట్టణ శివార్లలో 772 ఎకరాలలో విస్తరించి ఉంది. 400 క్వార్టర్స్తో 170 ఎకరాల్లో టౌన్షిప్ ఉందని మంత్రి చెప్పారు. ఈ ప్లాంట్ మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణలోని మరాట్వాడ, విదర్భ ప్రాంతాలలో సిమెంట్ అవసరాలను తీర్చిందన్నారు. బీఐఎఫ్ఆర్ మంజూరు చేసిన పథకం ప్రకారం వర్కింగ్ క్యాపిటల్ నిమిత్తం ప్లాంట్ కార్యకలాపాలు ఆగిపోయాయని తెలిపారు. 2008 లో ఉద్యోగులకు వీఆర్ఎస్ అందించడం ద్వారా ప్లాంట్ మూసివేయబడిందని చెప్పారు. అయితే ఈ విషయమై ఉద్యోగులు కోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు.
సహాయానికి సిద్ధంగా రాష్ట్రం..
ప్లాంట్కు దాదాపు 1500 ఎకరాల్లో లైమ్స్టోన్ మైనింగ్స్ ఉన్నాయన్నారు. 48 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలను పరిశ్రమ కలిగి ఉందన్నారు. ఈ యూనిట్లో 32 కేవీఏ విద్యుత్ సరఫరా కనెక్షన్ కూడా ఉందన్నారు. ప్లాంట్ కోసం నీటి లభ్యత ఇప్పటికీ ఉందని తెలిపారు. అవసరమైన నాణ్యమైన బొగ్గు సింగరేణి కాలరీస్ కార్పొరేషన్ లిమిటెడ్, ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు గనుల సంస్థతో అందుబాటులో ఉందన్నారు. దీనిని కాస్ట్-ప్లస్ ప్రాతిపదికన సరఫరా చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత దృష్ట్యా యూనిట్ను పునరుద్ధరించడానికి మీ సారథ్యంలో చర్యలు ప్రారంభించాల్సిందిగా తాము కోరుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో అవసరమైన అన్ని సహాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మరోవైపు,
సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో..
అటు ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కోసం కేంద్రాన్ని విన్నవించిన మంత్రి కేటీఆర్.. ఇటు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ పరిశ్రమల యాజమాన్యాలతో కీలక చర్చలు జరిపారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో కలిసి సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిమెంట్ పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని యాజమాన్యాలను మంత్రి కోరారు. స్థానికులకు ఎక్కువగా ఉపాధి కల్పించే కంపెనీలకు నూతన పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హుజూర్నగర్లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు.
పరిశ్రమలపై కేటీఆర్ కీలక సమీక్ష
రాష్ట్రంలో పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన ఆ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం టీఎస్ఐఐసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కలిసి పనిచేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేలా జరుగుతున్న ప్రయత్నాలను కూడా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశ్రమల తరలింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఈ దిశగా పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ డైరెక్టర్లు తమ పరిధిలో ఉన్న పరిశ్రమల తరలింపు వ్యవహారాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పర్యటించి నగరంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలన్నారు.
తెలంగాణకు భారీగా పెట్టుబడులు..
తెలంగాణ రాష్ట్రానికి గత ఏడు సంవత్సరాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలపైనా కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ విభాగాల వారీగా ఆయా డైరెక్టర్లతో రాష్ట్రానికి రానున్న పెట్టుబడి ప్రపోజల్స్, వాటి పురోగతిని మంత్రి చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే,
Recommended Video
జగన్ వల్ల కానిది కేటీఆర్ సాధిస్తారా?
ఉత్తర తెలంగాణలో బీజేపీ ఏకంగా మూడు లోక్ సభ సీట్లు గెలుచుకోవడంలో ప్రధాన హామీగా పనిచేసిన ''ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ'' అంశాన్ని అధికార టీఆర్ఎస్ మరింత తీవ్రతరం చేయనుంది. బీజేపీ ఎంపీల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, ఆదిలాబాద్ ప్లాంటును రీఓపెన్ చేయించే దిశగా గులాబీ అధినేతలు కీలక అడుగులు వేస్తున్నారు. అయితే ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ చేస్తోన్న ప్రయత్నాలన్ని దాదాపు విఫలమవుతోన్న క్రమంలో తెలంగాణలో ఇప్పటికే మూతపడిన ఫ్యాక్టరీని మంత్రి కేటీఆర్ తెరిపించగలరా? అనే చర్చకు తెరలేసింది. పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహంలో భాగంగా కేంద్రంలోని మోదీ సర్కారు వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతోన్న క్రమంలో ఆదిలాబాద్ సిమెంట్ ప్లాంట్ పునరుద్ధరణ సాధ్యమేనా? అనే అనుమానాలు రాకపోవు. పొరుగు రాష్ట్రం ఏపీలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడి జగన్ ప్రభుత్వం కార్మికులతో కలిసి ఆందోళనలను చేస్తున్నా కేంద్రం దిగొచ్చే పరిస్థితి కనిపించడంలేదు.