మెట్రోకి ఫ్లెక్సీ బ్రేక్?: విద్యుత్ తీగలపై పడటంతో రైలు నిలిపివేత..
హైదరాబాద్: మెట్రో రైలు రాకపోకలకు హోర్డింగులు బ్రేక్ వేస్తున్నాయి. ఈదురుగాలులకు, భారీ వర్షాలకు.. ఫ్లెక్సీలు చిరిగి మెట్రో మార్గంలోని ఓవర్ హెడ్ విద్యుత్ తీగలపై పడుతున్నాయి. దీంతో రైలు రాకపోకలను కొంతసేపు నిలిపివేయాల్సిన పరిస్థితి.
తాజాగా గురువారం జేఎన్టీయూ వద్ద ఇలాంటి పరిస్థితే రిపీట్ అయింది. మియాపూర్ నుంచి అమీర్ పేట్ బయలుదేరిన మెట్రో.. జేఎన్టీయూ వద్దకు రాగానే నిలిచిపోయింది. కారణం.. అక్కడి హోర్డింగ్కు ఉన్న ఫ్లెక్సీ చిరిగి మెట్రో మార్గంలోని ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడటమే. దీంతో రైలును సాయంత్రం 5.35 నుంచి 6.05 వరకు నిలిపివేశారు.

రైలు నిలిపివేతపై హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన ఫ్లెక్సీ మెట్రో ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడటం వల్లే రైలును 20 నిమిషాల పాటు నిలపాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.
ఆధునిక సాంకేతికతతో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయని అధికారులు చెబుతున్నా.. ఎంఎంటీఎస్ తరహాలో తరుచూ వాటిని నిలపాల్సి రావడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఓ ఫ్లెక్సీ చిరిగి ఓవర్హెడ్ విద్యుత్ తీగలపై పడటంతో.. ఖైరతాబాద్ లో ఎంఎంటీఎస్ రైలును గంటపాటు నిలిపివేశారు.
రైలు మార్గాల పక్కనున్న హోర్డింగుల పట్ల ఇకనైనా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తుతం మెట్రో రాకపోకలు సాగుతున్న నాగోల్-అమీర్ పేట్, మియాపూర్-అమీర్ పేట్ మార్గాల్లో పలు హోర్డింగ్స్ వీటిని ఆనుకునే ఉన్నాయి. వీటిని తొలగించడంలో జీహెచ్ఎంసీ, మెట్రో అధికారులు అలసత్వంతో వ్యవహరిస్తుండటం వల్ల తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది అగస్టులో ఎల్బీనగర్-అమీర్ పేట్ మెట్రో మార్గం కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమీర్ పేట్-హైటెక్ సిటీ మార్గంలోనూ మెట్రో పరుగులు పెట్టనుంది.












Click it and Unblock the Notifications