విభజన: వెంకయ్యకు అడ్వకేట్ జేఏసీ వినతిపత్రం
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కోరింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు శనివారం బంజారా హిల్స్ రోడ్డు నెంబర్. 12లోని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నివాసానికి వచ్చి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ ఎంతో మంది బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కానీ ఇంకా సంపూర్ణ తెలంగాణ రాలేదన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదకొండు నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడలేదని, దీన్ని వల్ల న్యాయవాద, కక్షిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
హైకోర్టు విభజన జరిగి తీరాలని 45 రోజులు పాటు న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన చేసినట్లు గుర్తు చేశారు. దీంతో కేంద్ర మంత్రి సదానంద గౌడ స్పందించి రెండు రాష్ట్రాలకు వీలైనంత త్వరగా ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హామీ ఇచ్చిరాన్నారు.
ఈ విషయంలో చొరవ తీసుకుని తెలంగాణలో హైకోర్టు ఏర్పాటయ్యే విధంగా కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు.