తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి చిచ్చు: మాజీ ఎమ్మెల్యే రాజీనామా: ఇక ఉండలేనంటూ లేఖ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ నాయకుడు, మల్కాజ్ గిరి లోక్సభ సభ్యుడు రేవంత్ రెడ్డిని నియమించినట్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధికారికంగా ప్రకటించిన వెంటనే- రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. రేవంత్ రెడ్డి నియామకాన్ని సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తోన్నారు. ఆయన నియామకాన్ని తప్పు పడుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్త జ్వాలలు చెలరేగడానికి దారితీసినట్టు కనిపిస్తోంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రాజీనామా సైతం చేయడం.. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
Recommended Video
సీనియర్లు భగ్గు..
ఊహించినట్టే- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలను పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టింది. ఆ పదవి రేవంత్ రెడ్డికే దక్కుతుందంటూ చాలాకాలం నుంచీ వార్తలు వస్తోన్నప్పటికీ- అధికారిక ప్రకటన వెలువడటంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత సుదీర్ఘకాలం పాటు ఆ పదవిని భర్తీ చేయలేదు.
ఆ తరువాత రేవంత్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. దీన్ని సీనియర్లు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వస్తోన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీ హనుమంత రావు వంటి నాయకులు బహిరంగంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అధిష్ఠానానికి లేఖలు సైతం రాశారు.
కేఎల్ఆర్ రాజీనామా..
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించిన వెంటనే- ఇక వికెట్లు పడటం ఆరంభమైంది కాంగ్రెస్లో. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన ఏఐసీసీ మాజీ అధినేత రాహుల్ గాంధీకి పంపించారు. ఆయన ఏఐసీసీ సభ్యుడు కూడా. పార్టీలో పదవులతో పాటు, తన ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తోన్నట్లు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అవకాశాలను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉండలేనంటూ..
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఆవిర్భవించిన మేడ్చల్ నియోజకవర్గానికి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తొలి ఎమ్మెల్యే. 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ స్థానం నుంచి ఘన విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలియజేయలేదు. పార్టీలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో తాను కొనసాగలేనని మాత్రమే స్పష్టం చేశారు. అందుకే ఏఐసీసీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
ఒక్కరితోనే ఆగుతుందా?
రేవంత్ రెడ్డి నియామకం ప్రకటన వెలువడిన వెంటనే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా చేయడం సీనియర్లలో నెలకొన్న అసంతృప్తిని తెలియజేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ప్రకంపనల తీవ్రత ఆయన ఒక్కరి రాజీనామాతోనే ఆగుతుందా? అనే గ్యారంటీ ఉండట్లేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నియామకాన్ని ముందునుంచీ గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన భవిష్యత్ నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుంటారనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.. లేదా తన నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేయడానికి కఠిన నిర్ణయాన్ని తీసుకోవచ్చనీ అంటోన్నారు.