సికింద్రాబాద్: నిప్పంటించిన రైలు బోగి నుంచి 40 మంది ప్రయాణికులను కాపాడారిలా!
హైదరాబాద్: అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పుపెట్టడంతోపాటు రైల్వే స్టేషన్లో ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ నిరసనకారుడు మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. నిరసనకారుల రాళ్ల దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.
నిప్పుపెట్టిన రైలులో చిన్నారులతో సహా 40 మంది ప్రయాణికులు
కనీసం 5,000 మంది ఆందోళనకారులు సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి దాదాపు 40 మంది ప్రయాణికులతో ఉన్న ప్యాసింజర్ రైలు కోచ్కు నిప్పుపెట్టడానికి ప్రయత్నించారు. ప్రయాణికులు, వారిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. నిప్పుపెట్టిన సమయంలో రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి వారందరినీ పక్కనే ఉన్న కోచ్లోకి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
5వేల మంది వచ్చి రైలుకు నిప్పుపెట్టారు
ఏ1 కోచ్పై నిరసనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సమయంలో కనీసం 40 మంది ప్రయాణికులు లోపల ఉన్నారని ఏసీ పవర్ కార్ మెకానిక్ అయిన సుమన్ కుమార్ శర్మ మీడియాకు తెలిపారు. "ఇక్కడ (కోచ్ లోపల) సుమారు 40 మంది ఉన్నారు, కానీ నేరం చేసిన వారిని నేను లెక్కించలేదు. వారిలో 5,000 మందికి పైగా ఉన్నారు" అని అతను కోచ్ లోపల ఉన్న శిధిలాలను చూపిస్తూ పేర్కొన్నాడు.
ఆ రైలులోని 40 మంది ప్రయాణికులను ఎలా కాపాడారంటే..?
ఆందోళనకారులు కోచ్కు నిప్పంటించే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఆ కోచ్ లోని 40 మంది ప్రయాణికులను వేరే కోచ్ లోకి తరలించి కాపాడారు. హింసాత్మక ఘటనల మధ్య ప్రయాణీకులను కోచ్ నుంచి బయటికి ఎలా తరలించారో చెబుతూ.. రెండు గేట్లు తెరిచి ఉన్నాయి, కాబట్టి తాము ప్రయాణీకులను ఒక వైపు నుంచి తరలించామన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మిమ్మల్ని(ప్రయాణికులను) సురక్షితంగా తరలిస్తుందని వారికి చెప్పామని తెలిపారు. కాగా, అగ్నిపథ్ నిరసనకారులు 4-5 రైలు ఇంజన్లు, 2-3 కోచ్లకు నిప్పు పెట్టారు. నష్టం ఎంత ఉందో విశ్లేషిస్తాం. ఒక వ్యక్తి గాయపడినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా తెలిపారు.
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు
కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హింసాత్మక ఘటనలకు పాల్పడినవారిలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి వరకు తిరిగి రైల్వే ప్రయాణాలను పునరుద్ధరించారు అధికారులు. దీంతో మళ్లీ ప్రయాణికుల సందడి కనిపించింది. మరోవైపు, కొత్త సైనిక నియామక విధానానికి వ్యతిరేకంగా బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో వరుసగా మూడో రోజుకి ప్రవేశించిన తర్వాత దక్షిణాది రాష్ట్రానికి నిరసనలు వ్యాపించాయి. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి.
బుధవారం నాడు నిరసనలు చెలరేగినప్పటి నుంచి 200 రైళ్లు ప్రభావితమయ్యాయి. 35 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 13 షార్ట్-టర్మినేట్ చేయబడ్డాయని రైల్వే తెలిపింది.












Click it and Unblock the Notifications