కాంగ్రెస్,బీజేపీ విధానాల వల్లే వ్యవసాయం సర్వ నాశనం.!మంత్రి ఎర్రబెల్లి ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణలో గులాబీ మంత్రులు దూకుడు పెంచారు. నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి, నేడు ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతిపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు అవగాహన రాహిత్యం తో మాట్లాడుతున్నారని, ఈ దేశాన్నీ ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్, బీజేపీలు మాత్రమేనని, ఈ రెండు పార్టీలు పాలించిన దానికన్నా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రైతులకు పూర్తి న్యాయం జరుగుతోందని స్పష్టం చేసారు. రైతు నాయకులుగా ముద్ర పడ్డ దేవిలాల్, చరణ్ సింగ్ లతో సమానంగా సీఎం చంద్రశేఖర్ రావు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తేల్చిచెప్పారు ఎర్రబెల్లి.
బీజేపి రైతు వ్యతిరేక ప్రభుత్వం.. కేసీఆర్ ను విమర్శించే స్థాయి బీజేపికి లేదన్న ఎర్రబెల్లి..
కేంద్రం లోని బీజేపీ మాత్రం రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. బీజేపీ రైతాంగ వ్యతిరేక విధానాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యమానికి నడుం బిగించారని అన్నారు. ఎరువుల ధరల పెంపు ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు లేఖ రాశారు. రైతులకు దేశంలో మేలు చేస్తున్న నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేంద్రం రైతులకు చేసిన ప్రయోజనం ఏదైనా ఉంటే చెప్పాలని ఎర్రబెల్లి బీజేపి నేతలకు సవాల్ విసిరారు.
పెట్రోల్ రేట్లతో సామాన్యుల నడ్డి విరిచిన కేంద్రం.. ఇప్పుడు ఎరువుల ధర పెంపుతో దిక్కుతోచని స్థితిలో రైతులు
కేంద్రం కొంతైనా మేలు చేస్తే రాష్ట్రం లో రైతులు ఇంకా సంతోషంగా ఉండేవారని, రైతుల ఆత్మహత్యలు కూడా జరిగేవి కావని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇప్పటికే కేంద్రం సామాన్య ప్రజానీకం నడ్డి విరిచిందని, ఇపుడు రైతులను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేలా ఎరువుల ధరలు పెంచారని మండిపడ్డారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్ధించేలా మాట్లాడుతున్నారని నిలదీసారు. 2 లక్షల 71 వేల కోట్ల రూపాయలను రైతుల కోసం ఖర్చు చేసిన ఏకైక సీఎం చంద్రశేఖర్ రావు అని ఎర్రబెల్లి ప్రశంసించారు.
రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు.. గతంలో రేవంత్ కాంగ్రెస్ విదానాలను వ్యతిరేకించారన్న ఎర్రబెల్లి
అంతే కాకుండా ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని ప్రధాని మోదీకి సూచించి ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకూ ఉలుకు లేదు పలుకు లేదని ఎర్రబెల్లి గుర్తు చేసారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేసినట్టే చేసి వేరే రూపంలో కేంద్రం రైతులను ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.బీజేపీ నేతల తాగే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని మండి పడ్డారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాల పై పోరాడ లేదా అని ప్రశ్నించారు. ఇపుడు కాంగ్రెస్ లో ఉండి అప్పటి ప్రభుత్వం రైతులకు ఎదో మేలు చేసిందని రేవంత్ చెప్పడం ఎంతవరకు సమంజసం కాదన్నారు ఎర్రబెల్లి.
Recommended Video
సీఎంను ఏమన్నా అంటే ప్రజలు ఉరికించి కొడతారు.. బీజేపిని హెచ్చరించిన ఎర్రబెల్లి..
రేవంత్ రెడ్డికి దమ్ముంటే కాంగ్రెస్,బీజేపి పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఏం చేశారో వివరాలు వెల్లడించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేసారు. తర్వాత చర్చకు వచ్చే దాని గురించి మాట్లాడాలని రేవంత్ రెడ్డికి హితవుపలికారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును పొగడకున్నా పర్వా లేదు కానీ తిడితే మాత్రం పాపం తగులుతుందన్నారు. రైతుల కోసం ఏం చేయని పార్టీలు ప్రభుత్వాన్ని నిదీసే హక్కు ఉందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును అరెస్టు చెస్తామంటు న్నారని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును టచ్ చేస్తే బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారని, ఎరువుల ధరలు దించేదాకా టీఆర్ఎస్ ఆందోళన కొనసాగుతుందని, కేంద్రం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేసారు.