మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి గా స్రవంతి పేరు ఖరారు..!!
తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న మునుగోడు బై పోల్ కు కాంగ్రెస్ సిద్దం అవుతోంది. అందులో భాగంగా తమ పార్టీ అభ్యర్ధిని ఏఐసీసీ ఖరారు చేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి..కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. బీజేపీ లో చేరి..రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది.
పాల్వాయి కుటుంబానికి పట్టు
ఇప్పటికే ప్రియాంక గాంధీ ఈ బై పోల్ కు సంబంధించి రెండు సార్లు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు మునుగోడు నుంచి మహిళా అభ్యర్ధిని బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఉప ఎన్నిక ఖాయం అనుకున్న సమయం నుంచీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న పాల్వాయి స్రవంతికే పార్టీ నాయకత్వం టిక్కెట్ ఖరారు చేసింది. చివరి వరకు పోటీలో క్రిష్టారెడ్డి పేరు ఉన్నా..చివరకు స్రవంతిని బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి మునుగోడు నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసారు.
కాంగ్రెస్ వ్యూహాత్మక ఎంపిక
ఆయన కుటుంబానికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. అదే విధంగా ఎన్నికల్లో మునుగోడు నుంచి స్రవంతి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో స్రవంతికి 27,441 ఓట్లు వచ్చాయి. కృష్ణారెడ్డి తో పాటుగా పల్లె రవి, కైలాస్ నేత కూడా టికెట్ కోసం చివరి వరకు రేసులో నిలిచారు. అయితే, సామాజిక వర్గం..మహిళ గా స్రవంతి పేరు వైపు హైకమాండ్ మొగ్గు చూపింది. బీజేపీ నుంచి పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీలో ఉండటంతో.. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజగోపాల్ వైపు మళ్లే అవకాశం లేదని టీపీసీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎవరనే దాని పైన ఆచి తూచి అడుగులు వేస్తోంది.
ఇక హీటెక్కనున్న ప్రచారం
రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలా.. లేక పార్టీలో వినిపిస్తున్న బీసీ వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ కు అంగీకరిస్తుందా అనేది చూడాల్సి ఉంది. గత ఉప ఎన్నికల కంటే కాంగ్రెస్ మునుగోడు విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇక, ఇప్పుడు అభ్యర్ధి ఖరారు కావటంతో టీపీసీసీ నేతలు..నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో శనివారం భేటీ కానున్నారు. మునుగోడు బై పోల్ పైన చర్చించనున్నారు. పార్టీ ప్రచారంతో పాటుగా,, ఇంటింటికి వెళ్లేలా కార్యక్రమాలు సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ - కాంగ్రెస్ అభ్యర్ధులు ఖరారు కావటంతో ఇక మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.