కెసిఆర్పై లీగల్ ఫైట్: రమ్మీ జూదం కాదు, స్కిల్ గేమ్ అంటూ...
తెలంగాణ రాష్ట్రంలో పేకాటను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎకె గంగూలీ న్యాయపోరాటానికి దిగారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పేకాటను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎకె గంగూలీ న్యాయపోరాటానికి దిగారు. ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఆర్డినెన్స్ జారీ చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ ముంబైకి చెందిన పలు రమ్మీ క్రీడా నిర్వహణ సంస్థలు హైదరాబాదులోని హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి
వాటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్, న్యాయమూర్తి తెల్లప్రోలు రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. ఆ సంస్థల తరపున హైకోర్టులో ఎకె గంగూలీ వాదించారు. రమ్మీ ఆట జూదం కాదని, నైపుణ్యాన్ని వెలికి తీసే క్రీడ అని ఆయన వాదించారు.
రమ్మీ జూదం కాదని గతంలో సుప్రీంకోర్టు కూడా ఇతర కేసుల్లో తీర్పు చెప్పినట్లు ఆయన తెలిపారు. మంగళవారం వాదనలు అసంపూర్తిగా ముగిశాయి.
దీనికి సంబంధించిన పూర్వరంగం పెద్దదే. పేకాటలో నష్టపోయిన ఓ వ్యక్తి హైదరాబాదులోని ఓ ప్రముఖ క్లబ్లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కెసిఆర్ ప్రభుత్వం పేకాట క్లబ్బులపై ఉక్కుపాదం మోపింది. పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో కూడా ఈ దాడులు జరిగాయి.
పేకాటపై నిషేధం ఎత్తివేయించడానికి తెర వెనుక ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. క్లబ్ల నిర్వాహకుల పక్షాన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వద్దకు రాయబారిగా కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే, ఆ నాయకుడికి కెసిఆర్ అక్షింతలు వేసినట్లు సమాచారం. పేకాట వల్ల కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయని, ఇటువంటి విన్నపాలు తన వద్దకు తేవద్దని ఆయన మందలించి పంపినట్లు తెలిసింది.
తాజాగా, ఆన్లైన్ రమ్మీపై కూడా ప్రభుత్వం నిషేధం విధించడంతో పేకాట నిర్వహణ సంస్థలు కోర్టుకెక్కాయి. తమ తరఫున అవి ప్రఖ్యాత న్యాయవాది గంగూలీని రంగంలోకి దింపడం విశేషం.