తెలంగాణ ఎన్నికలు: టీఆర్ఎస్కు అఖిల భారత హిందూ మహాసభ మద్దతు
హైదరాబాద్: తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అఖిల భారత హిందూ మహాసభ జాతీయాధ్యక్షుడు రామానుజ వ్రతధర జీయర్ స్వామి ఓ ప్రకటన చేశారు.
సనాతన ధర్మ పరిరక్షణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ఇక్కడ నిర్వహిస్తోన్న ధార్మిక కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచాయన్నారు. యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, బాసర తదితర క్షేత్రాల అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించారని కితాబిచ్చారు.

తెలంగాణలో మూడువేలకు పైగా ఆలయాలకు ధూపదీప నైవైధ్య పథకం కింద నెలకు రూ.6వేలు ఇస్తుండటం గొప్ప విషయమని చెప్పారు.
కాగా, తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిలుపుదల చేసింది. రాబోయే శాసనసభ ఎన్నికలను 2018 ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్ వరకు ఓటర్ల ముసాయిదా జాబితా సవరణ ప్రక్రియ చేపట్టేందుకు గతంలో ప్రకటన జారీ చేశారు.
ఆ తర్వాత అసెంబ్లీ రద్దయింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో రాష్ట్రంపై దృష్టి సారించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి గతంలో జారీచేసిన ప్రకటన రద్దు చేసి, శనివారం కొత్త నోటిఫికేషన్ జారీచేసింది. దీని ప్రకారం అక్టోబర్ ఎనిమిదో తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.
2018 జనవరి తర్వాత నమోదైన వారిని అనుసంధానం చేసి ఓటర్ల తుది జాబితాను పూర్తిచేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల ముఖ్య కార్యనిర్వహణాధికారి రజత్ కుమార్ జాబితా రూపకల్పన నుంచి తుది జాబితా ముద్రణ వరకు షెడ్యూల్ను విడుదల చేశారు.












Click it and Unblock the Notifications