హైదరాబాద్లో మూడోరోజూ కుండపోత వాన: మరో 3 రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్: నగరంలో వరుసగా మూడోరోజు కూడా భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లక్డీకపూల్, అసెంబ్లీ, బషీర్బాగ్, కోఠి, సుల్తాన్బజార్, నాంపల్లి, బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, అబిడ్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
నాంపల్లి, హిమాయత్నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్ కూకట్పల్లి, హైదర్నగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, ఎస్ఆర్నగర్, ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. యూసుఫ్గూడ, మైత్రివనం, అమీర్పేట., రామంతాపూర్, సైదాబాద్, కంటోన్మెంట్, నేరేడ్మెట్ , హబ్సిగూడ, ముషీరాబాద్, తదితర ప్రాంతాల్లోనూ జోరు వానపడింది. రహాదారుల పైకి వరద నీరు రావడంతో వాహనాదారులు, ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.
లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని, మురుగునీరు ఇళ్లల్లోకి చేరడంతో దోమలు విరుచుకుపడుతున్నాయని వాపోతున్నారు. అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు
మరోవైపు, రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇంటీరియర్ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం గురువారం బలహీనపడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్న ఆవర్తన ప్రభావంతో.. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇది రానున్న 48గంటల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతం మీదుగా మరింత బలపడే అవకాశం ఉందన్నారు.
రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, భోపాల్, గోండియా, జగదల్పూర్, కళింగపట్నం మీదుగా.. తూర్పు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి వెలుతుందని వివరించారు. కాగా, సెప్టెంబర్ నెలలో దేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.












Click it and Unblock the Notifications