దారులన్నీ ఓరుగల్లువైపే: కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ, సభకు గూగుల్ అనుసంధానం
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావదినోత్సవం గురువారం(ఏప్రిల్ 27న) చారిత్రక వరంగల్ నగరంలో జరగనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడానికి వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ఆవిర్భావదినోత్సవం గురువారం(ఏప్రిల్ 27న) చారిత్రక వరంగల్ నగరంలో జరగనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లడానికి వరంగల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలు బాటలు వేసిందన్న సెంటిమెంట్తో రెండో దఫా అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి తిరిగి ఇక్కడి నుంచే టీఆర్ఎస్ శంఖారావాన్ని పూరిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ మూడేళ్లలో బంగారు తెలంగాణ దిశగా టీఆర్ఎస్ సర్కార్ వేసిన అడుగులను రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించేందుకు ఇదే సభను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు వేదికగా ఎంపిక చేసుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఏమి చెబుతారోనన్న ఉత్కంఠతో రాష్ట్రం నలుమూల నుంచి వరంగల్కు తండోపతండాలుగా పార్టీ శ్రేణులు, ప్రజానీకం తరలివస్తున్నారు.
వరంగల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు 15 నుంచి 20 లక్షల మంది తరలివస్తారని పార్టీ అంచనా వేస్తుంది. ఈ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు అహోరాత్రులు శమ్రించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో సభ రికార్డు సృష్టించబోతుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది.
ఉద్యమ పార్టీగా అనేక భారీ బహిరంగ సభలు నిర్వహించిన అనుభవానికితోడు ప్రస్తుతం అధికారం కూడా తోడు కావడంతో వరంగల్ సభ భారీగా విజయవంతం అవుతుందన్న దాంట్లో ఎవరికీ అనుమానాలు లేకపోయినా, నాడు ఉద్యమ నాయకుడిగా ప్రజల మెప్పు పొందిన సిఎం కెసిఆర్, నేడు పాలనా సారథిగా ఎంతమేరకు ప్రజల మన్ననలు పొందుతారో టీఆర్ఎస్ భవితవ్యానికి వరంగల్ సభనే మార్గం చూపనుంది.

భారీ బందోబస్తు
వరంగల్ సభకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సభ జరిగే ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వరకు పోలీసు శాఖాపరంగా 12 సెక్టార్లగా విభజించారు. ప్రతి సెక్టారుకు ఐపీఎస్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. వారికి సహాయకులుగా డీసీపీ, ఏసీపీలు ఉంటారు. వీరితోపాటు అదనపు పోలీసులను మోహరించారు. కమిషనరేట్ పరిధిలో సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందిని విభాగాలుగా విభజించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారు. సభ జరిగే ఆవరణలో పోలీసులు ప్రత్యేకంగా కంట్రోల్ గదిని ఏర్పాటు చేసుకున్నారు. సభలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలను అమర్చుకున్నారు. పోలీసులు కంట్రోల్ గదికి అనుసంధానం చేసి ఉన్నతాధికారులు పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతోపాటు అదనపు పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. పోలీసు కమిషనర్ సుధీర్బాబు ఇప్పటికే పలుసార్లు మైదానాన్ని పరిశీలించారు. భద్రతపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో చర్చించి తీసుకున్నారు. సభలో అడుగడుగునా పోలీసులను మోహరించారు. సభ పూర్తయ్యే వరకు వీరు ఇక్కడ ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుదని పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో విధులు నిర్వర్తించే పోలీసులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మజ్జిగ ప్యాకేట్లను సరఫరా చేస్తున్నారు.

గూగుల్కు అనుసంధానం
టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సాంకేతిక సొబగులు అద్దుతున్నారు. ప్రచారం దగ్గర్నించి ఏర్పాట్ల వరకు అన్ని అంశాల్లో సాంకేతికతను జోడిస్తున్నారు. సభా ప్రాంగణంలో అశేష జనవాహిని వీక్షించేందుకు 60 భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. రెండు స్క్రోలింగ్ తెరలను ప్రత్యేకంగా తెచ్చారు. వేదిక సమీపంలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం తాత్కాలికంగా రెండు వైఫై టవర్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వాహనదారులకు ఇబ్బంది లేకుండా నేరుగా ఈ పార్కింగ్ జోన్లకు చేరుకునేందుకు వీలుగా ఈ పార్కింగ్ జోన్లతో గూగుల్ మ్యాప్కు లింక్ చేశారు. ఇందుకు సంబంధించిన లింక్ను సభ నిర్వాహకులు ఇప్పటికే ఆయా జిల్లాల నేతలకు వాట్సాప్ ద్వారా పంపించారు. సభకు రావాలనుకున్నవారు ఈ లింక్ ద్వారా నేరుగా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అంతేగకా, ప్రగతి నివేదన సభ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించారు. పార్కింగ్తో పాటు వివిధ ప్రాంగణాలను దీని ద్వారా కనిపెట్టవచ్చు. సభాస్థలికి సులభంగా చేరుకోవచ్చు. సభ పేరిట ఇప్పటికే ఫేస్బుక్ అకౌంట్ తెరిచారు. దీని ద్వారా ప్రత్యక్ష ప్రచారం చేయనున్నారు. రాత్రివేళల్లో విద్యుత్తు కాంతులతో మిరుమిట్లు గొలిపే భారీ బెలూన్లను ఎగరవేయనున్నారు.

పారామోటరింగ్తో పూలు
సుదూర ప్రాంతాల నుంచి సభకు తరలివస్తున్న అశేష జనవాహినికి ఘన స్వాగతం తెలపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పారామోటరింగ్ ద్వారా అతిథులపై ఆకాశం నుంచి పూల వర్షం కురిపించనున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఏర్పాటు చేశారు. పారామోటరింగ్ ఒక సాహస క్రీడ. పారాచ్యుట్ తరహాలో ఇద్దరు సాహసికులు పైకి ఎగురుతారు. అక్కడి నుంచి సభకు వచ్చే వారిపై పూలు కురిపిస్తారు. బుధవారం సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ట్రయల్ రన్ చేశారు. ముఖ్యమంత్రి వచ్చే సమయంలో ఆయనపైనా పూల వర్షం కురిపిస్తారు.

నిరసనల భయం
టీఆర్ఎస్ బహిరంగ సభలో నిరసన తెలపాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సభలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశముంది. పోలీసులు ముందస్తుగా నిరసన తెలిపే వారి నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎవరైనా నిరసన తెలిపేందుకు వస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించే అవకాశముంది. ఇందుకోసం పోలీస్ ప్రత్యేక విభాగం సిబ్బంది పని చేస్తుంది. ముందస్తు సమాచారం తీసుకుంటున్నారు.

కేసీఆర్ అక్కడే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 3.30కి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 4.25కి వరంగల్ చేరతారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో దిగిన తర్వాత ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం 6.40కి బహిరంగసభ జరిగే స్థలానికి చేరతారు. సభ ముగిసిన తర్వాత కెప్టెన్ ఇంటికి చేరతారు. రాత్రిపూట అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం పాలకుర్తిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications