ఎస్సై నిర్వాకం: మహిళలను ట్రాప్ చేస్తాడు, రెండో పెళ్లి చేసుకున్నాడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ ఏస్సైపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మహిళలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్న రఫీక్ ఖాన్ అనే ఎస్సై మొదటి భార్యను వేధిస్తూ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మొదటి భార్య తల్లిదండ్రులతో పాటు రెండో భార్యగా భావిస్తున్న యువతి తల్లిదండ్రులు కూడా అతనిపై ఆరోపణలు చేశారు.
రఫీక్ ఖాన్కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలున్నారు. అతను వాణిలత అనే అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకున్నట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రఫీక్ ఖాన్ నుంచి తమకు ప్రాణ భయం ఉందంటూ వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఆమె నుంచి సర్టిఫికెట్లు లాక్కున్నాడని వారు చెబుతున్నారు.
ఇదిలావుంటే, విడాకులు ఇవ్వాలంటూ తమ కూతురిని బెదిరిస్తున్నాడంటూ రఫీక్ ఖాన్ మొదటి భార్య తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు ఓ ప్రముఖ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ పలు ఆరోపణలు చేశారు.
మరో అమ్మాయి గురించి ప్రశ్నించినప్పుడు విడాకులు ఇవ్వాలని తనను బెదిరించాడని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. తెల్ల కాగితంపై సంతకం పెట్టాలని కూడా బెదిరించాడని ఆరోపించింది. ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్లిపోయాడని చెప్పింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఎస్సై రఫీక్ ఖాన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.