వందశాతం అది తప్పు... సీఎం రేవంత్ వ్యాఖ్యలకు అల్లు అర్జున్ షాకింగ్ కౌంటర్!
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపైన ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ ఘటనకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని బాధిత మహిళ కుటుంబ సభ్యులకు తాను సానుభూతి తెలుపుతున్నాను అన్నారు .
దురదృష్ట కరమైన ఘటన అన్న అల్లు అర్జున్
థియేటర్ వద్ద జరిగిన ఘటనకు తాను చాలా బాధపడుతున్నానని ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని అల్లు అర్జున్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం కి సంబంధించి శ్రీ తేజ్ ఆరోగ్యం పైన గంట గంటకు అప్డేట్ తెలుసుకుంటున్నాను అన్నారు. సినిమా థియేటర్ తనకు గుడి వంటిదని అటువంటి చోట తన ఫ్యాన్స్ అందరినీ సంతోష పెట్టడమే లక్ష్యంగా తను వెళ్లానని అల్లు అర్జున్ చెప్పారు.

వ్యక్తిత్వ హననం జరిగితే బాధ పడుతున్నా
తన వ్యక్తిత్వ హననం జరిగితే తాను చాలా బాధపడుతున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఒక మహిళ చనిపోయింది అంటే తనకు బాధ ఉంటుంది కానీ సంతోషం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. తను బాధ్యతా రహితంగా ఎప్పుడు ప్రవర్తించలేదని అల్లు అర్జున్ తెలిపారు. తాను అనుమతి లేకుండా వెళ్లలేదని, తన పైన చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన వ్యాఖ్యలు చేశారు.
మహిళ చనిపోయిన విషయమే తనకు తెలీదు
అసలు మహిళ చనిపోయిన విషయమే తనకు తెలియదని, తాను థియేటర్ నుంచి వెళ్లిపోయిన తర్వాత రోజు తనకు ఆ విషయం తెలిసిందన్నారు. ఆ తరువాత ఆ మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాలని ప్రయత్నిస్తే బాధిత కుటుంబం కేసు నమోదు చేసింది కాబట్టి వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పారన్నారు. మహిళ చనిపోయింది అని తెలిసిన తర్వాత రోడ్ షో చేసాడు, ర్యాలీ చేశాడు అని చెప్పడం తప్పన్నారు.
ఘటన తర్వాత అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకున్నా
సినిమా చూస్తున్నప్పుడు తనకు పోలీసులు ఏమీ చెప్పలేదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. రద్దీ ఎక్కువగా ఉందని మావాళ్ళు వచ్చి చెప్తే థియేటర్ నుంచి వెళ్లిపోయాను అని చెప్పిన అల్లు అర్జున్ మర్నాడు ఉదయం వరకు తనకు ఏం జరిగిందో తెలియదన్నారు.15 రోజులుగా తను ఎక్కడికి వెళ్లలేదని ఇంట్లోనే ఉన్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు, ఘటన జరిగిన తర్వాత అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకున్నానని అన్నారు.
రోడ్ షో, ర్యాలీ చేశాను అనేవి తప్పుడు ప్రచారం
మూడేళ్లపాటు కష్టపడి సినిమా తీశానని కేవలం ప్రజలను సంతోషపెట్టేందుకే నటుడిగా అభిమానులను అలరించడం కోసమే తాను పనిచేస్తున్నట్టుగా తెలిపారు. 20 ఏళ్లుగా అనేకసార్లు ఆ థియేటర్ కు వెళ్లానని థియేటర్ వద్ద పోలీసుల డైరెక్షన్లోనే ముందుకు వెళ్లానని పేర్కొన్న అల్లు అర్జున్ రోడ్ షో, ర్యాలీ చేశాను అనేవి తప్పుడు ప్రచారం అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
సినిమా చూస్తున్నప్పుడు పోలీసులు తనకు ఏమీ చెప్పలేదు
వేల మంది అభిమానుల కోసం బయటకు వచ్చి కనిపించానని, సినిమా చూస్తున్నప్పుడు పోలీసులు తనకు ఏమీ చెప్పలేదని, తనకు మహిళా చనిపోయిన విషయమే అప్పటికి తెలియదన్నారు. తన ఫ్యాన్స్ అంటే తనకు చాలా ప్రేమన్నారు. వాళ్ళ కష్టం నాకు సంతోషం ఎలా అవుతుందన్నారు.
వంద శాతం అది తప్పు
నేను మీడియా ముందు షో చేయటం లేదన్నారు. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులను పరామర్శించటానికి చాలా దూరం వెళ్లానని గుర్తు చేశారు. తెలుగు వారి పరువు నిలబెట్టేందుకు తాను ప్రయత్నం చేస్తుంటే తన ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం జరుగుతుందన్నారు. తనపైన జరుగుతున్న ప్రచారం వంద శాతం తప్పన్నారు.












Click it and Unblock the Notifications