125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇక్కడే!: ఎన్టీఆర్ గార్డెన్ పేరు మారుస్తారా?
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో భారత నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ విగ్రహాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా ఉండబోతోంది.
తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పనున్న 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్కు సమీపంలోనే ఏర్పాటు చేయనుండటం విశేషం. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని ఎన్టీఆర్ గార్డెన్స్ను ఆనుకొని ఉన్న 36 ఎకరాలను ఇందుకోసం ఎంపిక చేసింది.
అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించి చివరికి ఈ ప్రాంతాన్ని ఎంపకి చేసింది. నగరంలో మధ్యలో, సచివాలయానికి సమీపంలో ఉన్న ఈ స్థలం అన్నింటికి అనువైనదిగా గుర్తించారు.
ఎంపిక చేసిన 36 ఎకరాల్లో రెండెకరాల్లో అంబేద్కర్ విగ్రహాం, మ్యూజియం, సమావేశమందిరం నిర్మాణం చేయనున్నారు. మిగిలిన 34 ఎకరాల్లో అంబేద్కర్ స్క్వేర్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విగ్రహ ఏర్పాటు, జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
తొలుత లుంబినీ పార్కులో ఏర్పాటుకు సంకల్పించారు. అయితే, అది కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అంజయ్య స్మారకం కావడం, స్థలాభావం నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కనే స్థలాన్ని పరిశీలించి దాదాపు ఖరారు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేయనుంది. అంబేద్కర్ విగ్రహం చుట్టూ 36 ఎకరాల స్థలాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని ఆదివారం ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, ఎస్సీల అభివృద్ధి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.
విగ్రహ ఏర్పాటు కమిటీ ఎంపిక చేసిన స్థలంలో కేసీఆర్ ఈ నెల 14న శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గార్డెన్గా పేరొందిన ఆ పార్కును ఇక నుంచి అంబేద్కర్ గార్డెన్గా పేరు మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
విగ్రహ ఏర్పాటు, జయంతి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన విగ్రహ ఏర్పాటు కమిటీ కన్వీనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జా ఆధ్వర్యంలో ఆదివారం బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ (బీపీపీఏ)లో కమిటీ తొలి సమావేశం జరిగింది.
సమావేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దాని పరిసర ప్రాంతాలను (36 ఎకరాల విస్తీర్ణం) పర్యాటక కేంద్రంగా మార్చాలని తీర్మానించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహ స్థలంతోపాటు లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్మించతలపెట్టిన అంబేద్కర్ టవర్ నిర్మాణ స్థలం, బోరబండ వద్ద నిర్మించ తలపెట్టిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ స్థలాలను మంత్రుల బృందం పరిశీలించింది.