నయా నిజాం ను వెళ్లగొట్టాలి - బండి సంజయ్ చాలు : అవినీతి మయం -మైనార్టీ రిజర్వేషన్ల రద్దు : అమిత్ షా..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కేంద్ర హోం మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా విరుచుకుపడ్డారు. ఎన్నికలు ఎప్పుడో కాదు..రేపు ప్రకటించినా బీజేపీ సర్కార్ ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఇలాంటి అవినీతిమయ సర్కార్ ను చూడలేదంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు - యువత ఆకాంక్షలను బీజేపీ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వ స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందంటూ ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేసి ఆ కోటాను ఎస్సీ, ఎస్టీలకు వర్తింపచేస్తామని ప్రకటించారు. షా తన ప్రసంగంలో బండి సంజయ్ ను ప్రశంసించారు. కానీ, ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన తీసుకురాలేదు. నయా నిజాం ప్రభువైన ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దె దించే సమయం ఆసన్నమైందని అమిత్ షా పేర్కొన్నారు.
ఇలాంటి సీఎంను జీవితంలో చూడలేదు
ఇలాంటి అవినీతి..పనికిమాలిన, అసమర్థ ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని విమర్శించారు. తెలంగాణ ఎవరి జాగీరూ కాదని, అందరికీ సమానహక్కు ఉందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ మరో బెంగాల్గా మారుస్తున్నారని, హత్యా రాజకీయాలతో తమ కార్యకర్త సాయిగణేశ్ను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని జైలుకు పంపుతామన్నారు.
కేసీఆర్ను, మజ్లిస్ను గద్దె దించిన నాడే తెలంగాణకు విమోచన అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక.. మైనార్టీల రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు కోటా పెంచుతామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారుతోపాటు, తెలంగాణలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడాలని.. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
టీఆర్ఎస్ - ఎంఐఎంను పక్కకు నెట్టి
తాము అధికారంలోకి వచ్చాక.. రాష్ట్ర ప్రభుత్వం తరఫునే ఉప్పుడు బియ్యం కొంటామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు పేర్లు మార్చి..తమ ఫొటోలతో అమలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, రాజోలిబండ వంటి పథకాలకు కేంద్రం నిధులిచ్చినా అమలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. సైన్స్ సిటీ పెడతామంటే 25 ఎకరాలు ఇవ్వడం లేదన్నారు.
వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ పెడతామని 2017 నుంచి కేంద్రం లేఖలు రాస్తున్నా స్పందించలేదని చెప్పారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ సంక్షేమానికి రూ.2,52,202 కోట్లు ఇచ్చారని వివరించారు. మజ్లిస్కు భయపడే 370 ఆర్టికల్ రద్దును కేసీఆర్ వ్యతిరేకించారని ధ్వజమెత్తారు. బీజేపీ భయపడదని... ఆ రెండు పార్టీలనూ ఒకేసారి పక్కకు నెట్టి అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేసారు.
మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం
కుమారుడు, కుమార్తె కోసం కేసీఆర్ ఎన్ని స్కాములు చేశారో అంటూ ఆరోపించారు. కేసీఆర్ను గద్దె దించడానికి తాను రావాల్సిన అవసరం లేదని... బండి సంజయ్ ఒక్కరూ చాలంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు.. నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేర్చేలదని చెప్పిన షా.. బీజేపీ అధికారంలోకి రాగానే వీటిని అమలు చేస్తామని చెప్పారు. యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు.
దళితులకు కేటాయించిన రూ.50 వేల కోట్ల బడ్జెట్ ఏమైందని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఏమైందని నిలదీసారు. 30 సెంటీమీటర్లు కూడా ఇవ్వలేదంటూ ఎద్దేవా చేసారు. ఈ సభలో అమిత్ షా తో సహా పార్టీ నేతలంతా పూర్తిగా టీఆర్ఎస్పై, కేసీఆర్పై మాత్రమే విమర్శలు గుప్పిం చారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామన్నది చెప్పారు. కానీ ఎవరూ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తేలేదు. విమర్శలేమీ చేయలేదు.