అమిత్ షా సభతో ఒక్క దెబ్బకు రెండుపిట్టలు.. బీజేపీ ప్లాన్ పై ఆసక్తికర చర్చ!!
అమిత్ షా సభ ద్వారా టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి బిజెపి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుందా? రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మైలేజ్ నేపథ్యంలో, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే కనిపించేందుకు వ్యూహం రచించిందా? అమిత్ షా సభ ద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

తెలంగాణాలో అగ్రనేతల పర్యటనలతో శరవేగంగా మారిన రాజకీయాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుండే ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు చెందిన అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎదురులేని పార్టీగా అవతరించిన టిఆర్ఎస్ పార్టీ గత రెండు దఫాలుగా పాలన సాగిస్తోంది. అయితే టిఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవడం కోసం బిజెపి,కాంగ్రెస్ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాయి.

తెలంగాణాలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం రేసులో బీజేపీ, కాంగ్రెస్ లు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బిజెపి కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతుంటే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది. ఇక రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బిజెపి, కాంగ్రెస్ మేమంటే మేమున్నామని చెప్పుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
అయితే గతంలో జరిగిన అనేక ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చాయి. డిపాజిట్లు కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తింది. ఊహించని విధంగా టిఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి బిజెపి ఆయా స్థానాలలో విజయం సాధించడంతో తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలకు చూపించగలిగింది.

రాహుల్ పర్యటనతో కాంగ్రెస్ కు ఊహించని మైలేజ్
జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని గుర్తించిన బిజెపి గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకు రావచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రజా సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేస్తోంది. ఇక బాగా వెనుకబడి పోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీని రంగంలోకి దింపి రెండు రోజుల పర్యటన నిర్వహించి ఒక్కసారిగా ఊహించని మైలేజ్ ను దక్కించుకుంది. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ కాస్త పుంజుకుంది.

రాహుల్ సభ ఎఫెక్ట్ తోనే అమిత్ షా సభకు భారీ జనసమీకరణ
వరంగల్ లో నిర్వహించిన రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి మద్దతు ఉందని చూపించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో రాహుల్ గాంధీ సభ ప్రభావంతో అమిత్ షా సభను భారీగా జనసమీకరణ చేసి గ్రాండ్ గా నిర్వహించి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని చూపించే ప్రయత్నంలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది.

అమిత్ షా సభ ఒక దెబ్బకు రెండు పిట్టలు, టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కు చెక్ పెట్టే ప్లాన్
రాహుల్ గాంధీ సభతో రాజకీయంగా కాస్త ముందుకు వస్తున్న కాంగ్రెస్ ను వెనక్కి నెట్టేసే వ్యూహం కూడా అమిత్ షా సభ నేపథ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒక పక్క టిఆర్ఎస్ పార్టీతో తల పడుతూనే, మరో పక్క కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా వెనక్కి నెట్టాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక అమిత్ షా సభ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అటు టిఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications