ధర్మపురి అరవింద్కు అమిత్ షా ఫోన్: దాడిని ఖండించిన కేంద్రమంత్రి, ఘటనపై ఆరా
న్యూఢిల్లీ/హైదరాబాద్: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్పై జరిగిన దాడిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఖండించారు. దాడి జరిగిందని తెలియగానే స్వయంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు అమిత్ షా. ఈ క్రమంలో దాడి ఘటనపై అమిత్ షాకు వివరించారు అరవింద్.
ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అరవింద్ ఎక్కడ తిరిగినా దాడులు చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచించిందని, ఇవాళ్టి ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గోదావరి ముంపును పరిశీలించడానికి, వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ ధర్మపురి అరవింద్ను కొందరు గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అరవింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు.ఆ సమయంలో మరోసారి అడ్డుకున్నారు. దీంతో తిరుగు పయనమైన అరవింద్ను మరోసారి అడ్డగించారు. గ్రామస్థులను పోలీసులు తప్పించి అరవింద్ కాన్వాయ్ను ముందుకు పంపించారు. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్థులు.. కాన్వాయ్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, గ్రామస్తుల పేరుతో టీఆర్ఎస్ గూండాలే దాడులు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.