కార్యకర్తలకు షాకిచ్చారు: బేగంపేటలో వేదికపై మాట్లాడకుండానే వెళ్లిన అమిత్ షా
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులో అడుగు పెట్టారు. అధ్యక్షుడి రాక నేపథ్యంలో బీజేపీ నేతలు బేగంపేటలో సభను ఏర్పాటు చేశారు. అక్కడకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. అయితే, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. సభ వేదిక పైకి వచ్చి ఆ తర్వాత ఏం మాట్లాడకుండానే వేదిక దిగి వెళ్లిపోయారు.
సభ వేదిక పైకి వచ్చిన ఆయనకు నేతలు పూలమాల వేసి సన్మానించారు. అనంతరం ఆయన కార్యకర్తలను చూస్తూ చేతులు ఊపుతూ అభివాదం చేసి అందరినీ ఉత్సాహపరిచారు. అయితే, ఆయన కాసేపు ఏదైనా మాట్లాడుతారని భావించారు. కానీ ఏమీ మాట్లాడకుండానే వేదిక మీద నుంచి తిరిగి కత్రియా హోటల్కు వెళ్లిపోయారు.

దీంతో ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో బీజేపీ కార్యకర్తలు ఉండిపోయారు. అయితే ఆయనకు మాట్లాడాలని రాష్ట్ర నేతలు సమాచారం ఇవ్వలేదా లేదా పార్టీ బలోపేతం కోసం వచ్చినందున ఆయన మిన్నకుండి పోయారా తెలియాల్సి ఉంది. కానీ కార్యకర్తలు మాత్రం నిరాశతో వెనుదిరిగారు. ఒక్క నిమిషమైనా మాట్లాడితే బాగుండేదని వాపోయారు. ఆయన కత్రియా హోటల్లో ఆరెస్సెస్, బీజేపీ నేతలతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications