తెలుగు మీడియాధిపతితో అమిత్ షా - టీడీపీతో లింకు ఉండేనా : టీఆర్ఎస్ - వైసీపీలో చర్చ...!!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మునుగోడు సభకు వస్తున్నారు. ఈ నెల 21న ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. అయితే, ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసారు. అందులో..మునుగోడు సభ పూర్తయిన తరువాత అమిత్ షా రోడ్డు మార్గం లో ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్నారు. దాదాపు 45 నిమిషాలు అక్కడే అమిత్ షా ఉండే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు. అమిత్ షా ఇప్పుడు ఫిల్మ్ సిటీకి వెళ్లటం రాజకీయంగా చర్చకు కారణమవుతోంది.

ఫిల్మ్ సిటీకి అమిత్ షా
గతంలోనూ 2018 జూలైలోనూ అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడి హోదాలో నాడు ఫిల్మ్ సిటీకి వెళ్లారు. అక్కడ మీడియా దిగ్గజం రామోజీని కలిశారు. ఇప్పుడు మరోసారి కలవనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో పార్టీ అధ్యక్ష హోదాలో కలిసిన సమయంలో 'సంపర్క్ ఫర్ సమర్థన్' కార్యక్రమంలో భాగంగా ఆయన రామోజీతో భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కారు గత నాలుగేళ్లుగా సాధించిన విజయాల గురించి వివరించారు. అయితే, ఇప్పుడు తెలంగాణలో బీజేపీ రాజకీయంగా కీలక అడుగులు వేస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో కనిపిస్తోంది. ముందుగా మునుగోడు ఉప ఎన్నిక పైన బీజేపీ అధినాయకత్వం.. వ్యక్తిగతంగా అమిత్ షా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే...మునుగోడు సభకు ఆయన హాజరవుతున్నారు.

రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ఇక, ఇప్పుడు ఆయన ఫిల్మ్ సిటీ సందర్శన అంశం.. తెలంగాణలో టీఆర్ఎస్.. ఏపీలో వైసీపీలోనూ చర్చకు కారణమవుతోంది. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మొదలు వైసీపీ నేతలు ఆ రెండు పత్రికలు అంటూ అవకాశం వచ్చిన ప్రతీ సందర్బంలోనూ ఆరోపణలు చేస్తున్నారు. నాడు వైఎస్ హయాంలో..ఇప్పుడు జగన్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఆ రెండు పత్రికలు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికీ వైసీపీ నేతల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోసారి అమిత్ షా పర్యటనలో ఫిల్మ్ సిటీలో ఏకంగా 45 నిమిషాల సేపు ఉండటం తో రాజకీయంగా అనేక అనుమానాలు - సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. మార్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా.. రెండు రాష్ట్రాల్లోని రాజకీయాల పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది.

భేటీ మర్యాద పూర్వకమంటూ
ఇక, వచ్చే ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా తో సమావేశంలో దీని పైన చర్చకు వస్తుందా అనే కోణంలో వైసీపీలో చర్చ సాగుతోంది. కానీ, ఈ పర్యటనలో రాజకీయం లేదనేది బీజేపీ నేతల వాదన. దీంతో..ఇప్పుడు ఈ భేటీ తెలంగాణ - ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆసక్తి కరంగా మారుతోంది. ఫిల్మ్ సిటీలో కార్యక్రమం పూర్తయిన తరువాత 8 గంటల నుండి 9.30 వరకు హోటల్ నోవాటెల్ లో లో పార్టీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. తెలంగాణలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం.. మనుగోడు బై పోల్ పైన రూట్ మ్యాప్ ఖరారు చేయనున్నారు. తిరిగి రాత్రి 9.30 కి డిల్లీ వెళ్లే విధంగా షెడ్యూల్ ఫిక్స్ అయింది.












Click it and Unblock the Notifications