మున్సిపల్ ఉద్యోగులమని బిల్డప్.. ఒంటరి మహిళలే టార్గెట్.. అందుకే బీ అలెర్ట్ అంటున్న పోలీస్!!
దొంగలు జనాలకు అనుమానం రాకుండా రోజుకో రకంగా కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొరియర్ వచ్చిందంటూ తలుపు తట్టి ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి, వాళ్ల ఇళ్లల్లోకి చొరబడి చంపేస్తామని బెదిరించి చోరీలు చేస్తున్న వారు కొందరైతే, మున్సిపల్ ఉద్యోగులమని చెప్పి, ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లకు వెళ్లి, వారిని మాటల్లో పెట్టి, దొంగతనాలకు పాల్పడుతున్న చోర శిఖామణులు మరికొందరు. తాజాగా మున్సిపల్ ఉద్యోగుల పేరుతో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు.

మున్సిపల్ ఉద్యోగుల పేరుతో చోరీలు.. ముఠా అరెస్ట్
మున్సిపల్ ఉద్యోగుల పేరుతో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముగ్గురు దొంగల ముఠా సభ్యులు మున్సిపల్ ఉద్యోగులమని చెప్పి, ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లకు వెళ్లి వారిని మాటల్లో పెట్టి, ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వెల్లడించారు. పోలీసులు పట్టుకున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా నుండి 15 లక్షల 50 వేల రూపాయల విలువ గల 320 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒంటరి మహిళలే టార్గెట్ .. సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యం
సులభంగా డబ్బు సంపాదించాలని భావించిన ముగ్గురు దొంగలు ఇప్పటివరకు మహారాష్ట్ర కొల్హాపూర్ ప్రాంతంలో మూడు చోరీలు, మహబూబ్ నగర్ జిల్లాలో మూడు చోరీలు, కరీంనగర్, వరంగల్ జిల్లాలలోనూ చోరీలకు పాల్పడినట్టు వెల్లడించారు. మున్సిపల్ ఉద్యోగుల మని చెప్పి ఒంటరిగా ఉన్న మహిళలు ఇళ్లకు వెళ్లి వారిని మాటలతో దృష్టి మరల్చి వారి ఇళ్లలో డబ్బు, నగలు చోరీ చేయడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో గత నెల 29వ తేదీన కే యు సి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ మరియు సప్తగిరి కాలనీలలో రెండు ఇళ్లలో ఈ ముఠా సభ్యులు, మున్సిపల్ ఉద్యోగుల మని చెప్పి, సెప్టిక్ ట్యాంకు కొలతలు తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేసి చోరీ చేశారు.

మాటల్లో పెట్టి చోరీలు .. పట్టుకున్న పోలీసులు
వీరిలో ఒకరు ఒంటరిగా ఉన్న మహిళలను మాటలతో దృష్టి మరల్చి, ఆపై మిగతా ఇద్దరూ ఇళ్లల్లో చోరీ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఈ తరహా చోరీ చేసి, తిరిగి హన్మకొండకు వస్తున్న క్రమంలో అధునాతన టెక్నాలజీతో దొంగలను గుర్తించిన పోలీసులు కిడ్స్ కాలేజ్ క్రాస్ రోడ్డు వద్ద వారిని అరెస్టు చేశారు. నిందితులను విచారించగా వారు చేసిన చోరీల వివరాలు వెల్లడించినట్టు సి పి డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు.

అపరిచిత వ్యక్తులు ఇళ్ళకు వస్తే తస్మాత్ జాగ్రత్త
ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే అప్రమత్తంగా ఉండాలని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఇళ్లకు వచ్చినప్పుడు వారి కదలికలను గమనించాలని, ఇంట్లో డబ్బులు, నగలు సేఫ్ గా ఉండేలా జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని చెబుతున్నారు. రోజుకో రకంగా కొత్త తరహా దొంగతనాలు పెరిగిపోతున్న సమయంలో తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications