తెలంగాణ అంతటా ఆంధ్రా కాంట్రాక్టర్లే: గుత్తా ఫైర్
నల్గొండ/ వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ని ఓడించకపోతే ప్రజలకు మరింత నష్టం జరుగుతుందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వామపక్షాలు కాంగ్రెస్కు మద్ధతు ఇవ్వాలని కోరారు.
వాటర్గ్రిడ్ సహా అన్నింటిలోను ఆంధ్రా కాంట్రాక్టర్లే అప్పగించారని ఆరోపించారు. ఈ నెల 5న నెహ్రూ జయంతి ఉత్సవాల సందర్భంగా నాగార్జున సాగర్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సదస్సు జరుగుతుందిని తెలిపారు. ఈ సదస్సుకు పీసీసీ అధ్యక్షుడి నుంచి మండల పార్టీ అధ్యక్షులంతా హాజరవుతారని గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
కెసిఆర్కు ఓటు దెబ్బ తగలాలి
ఇదిలావుంటే, ఆశా వర్కర్లను ఘోరంగా అవమానించిన కేసీఆర్కు ఓటు దెబ్బ తగలాలని సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. సోమవారం నగరంలో ఏకశిలా పార్కులో వామపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల హామీలను నేరవేర్చలేదని ఆరోపించారు. వామపక్షాల అభ్యర్థి గాలి వినోద్కుమార్ గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. వెనుబడిన కులాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తమ్మినేని వీరభద్రం విమర్శించారు.