చారిత్రక వారసత్వానికి చెదలు: కుప్పకూలిన తట్లకొండ బౌద్ధ స్తూపం: 2000 సంవత్సరాల చరిత్ర..
విశాఖపట్నం: చారిత్రక వారసత్వ సంపదకు చెదలు పట్టాయి. శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న బౌద్ధ క్షేత్రం తట్లకొండలోని మహా స్తూపం కుప్పకూలిపోయింది. స్తూపంలోని ఓ భాగం మొత్తం నేలకు ఒరిగింది. విశాఖపట్నం జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తట్లకొండ మహా స్తూపాన్ని తక్షణమే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం శివార్లలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న ఈ మహా స్తూపం కూలిపోవడం పట్ల పర్యాటకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం-భీమిలి మార్గంలో ఉన్న ఈ బౌద్ధ క్షేత్రాన్ని శాతవాహనుల కాలంలో నిర్మించినట్లుగా చెబుతారు. దీనికి సంబంధించిన చారిత్రక సాక్ష్యాధారాలు సంబంధిత ప్రదేశంలో ఉన్నాయి. 30 సంవత్సరాల కిందట చేపట్టిన పురావస్తు శాఖ తవ్వకాల సందర్భంగా ఈ బౌద్ధ క్షేత్రం వెలుగులోకి వచ్చింది. తట్లకొండ, బావికొండ, బొజ్జనకొండ, పావురాల కొండ పేర్లతో ఉన్న ప్రదేశాలన్నింటినీ కలిపి బౌద్ధ క్షేత్రంగా గుర్తించింది ప్రభుత్వం. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు గానీ, కట్టడాలు గానీ, నిర్మాణాలు గానీ చేపట్టకూడదని ఆదేశించింది. ఈ ప్రాంతాన్ని చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించింది. సర్వే నంబర్ 314 పరిధిలోని తట్లకొండ బౌద్ధ క్షేత్రం పరిధి మొత్తాన్ని చారిత్రక వారసత్వ సంపదగా గుర్తిస్తూ 1978లోనే జీవోను జారీ చేసింది.
కాలక్రమేణా ఈ బౌద్ధ క్షేత్రంలో ఉండే చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కొద్ది రోజులుగా విశాఖపట్నం సహా జిల్లా వ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలకు తట్ల కొండలోని బౌద్ధ మహా స్తూపం కుప్పకూలిపోయింది. ఈ స్తూపానికి చెందిన ఓ భాగం మొత్తం నేలకు ఒరిగిపోయింది. 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ స్తూపం సహా బౌద్ధ క్షేత్రాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కోటిన్నర రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులతో సుందరీకరణ పనులను చేపట్టారే గానీ.. స్తూపాల సంరక్షణ పనులు నిర్వహించలేదనేది ఈ ఘటనతో స్పష్టమైంది.
ఈ స్తూపాన్ని యథాతథంగా పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని బౌద్ధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మహాస్తూపం కుప్పకూలిందనే విషయం తెలుసుకున్న వెంటనే పలువురు బుద్ధిస్టులు తట్లకొండకు చేరుకున్నారు. మిగిలిన మహా స్తూపాల స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. గతంలోనూ ఒకటి, రెండుసార్లు ఈ మహా స్తూపం ధ్వంసమైన ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ.. అవి పాక్షికమే. ఈ సారి సగానికి పైగా స్తూపం నేలకు ఒరిగిపోవడం పట్ల పర్యాటకులు, బౌద్ధులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. పునరుద్ధరించాలని కోరుతున్నారు.