'ఉమ్మడి హైకోర్టు విభజన జాప్యం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పెడచెవిన పెట్టిందే తప్ప ఆ దిశగా చొరవ తీసుకులేదని ఎంపీ వినోద్ ఆరోపించారు. అయితే హైకోర్టు విభజన జాప్యం వెనుక ఏదో రహస్య ఎజెండా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే విభజన జరగకుండా ఉద్దేశపూర్వకంగా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంపడుతున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైకోర్టు హైదరాబాద్లో ఉంటే జగన్ కేసులు ఏమవుతాయో అనే అనుమానం ఆయనకు ఉన్నట్టు ఉందని ఎంపీ వినోద్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో హైకోర్టు విభజనకు జాప్యం జరిగితే గనుక ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడే కారణం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

హైకోర్టు విభజన అంశాన్ని గతంలో పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు వీలైనంత త్వరగా విభజిస్తామని ఒక మంత్రి, రెండు నెలల్లోనే పూర్తి చేస్తామని మరో మంత్రి హామీ ఇచ్చినా అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయన్నారు. ఇప్పుడు కూడా వారు ఇస్తున్న హామీలపై తమకు ఏమాత్రం నమ్మకం లేదన్నారు.
లోక్సభలో మంగళవారం మధ్యాహ్నం ఎంపీ జితేందర్రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అనంతరం ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలకు వేరువేరు హైకోర్టులు ఉండాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 30 చాలా స్పష్టంగా పేర్కొన్నదని ఆయన గుర్తు చేశారు.
ఇందుకు ఉదాహరణగా గతంలో ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ర్టాలు ఏర్పడినప్పుడు ఆరు నెలల్లోనే వాటికి హైకోర్టులు ఏర్పడ్డాయని ఆయన గుర్తుచేశారు. అయితే తెలంగాణ ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా, హైకోర్టును విభజన చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ గతేడాది లోక్సభలో హైకోర్టు విభజన త్వరగానే జరుగుతుందని చెప్పారని, ఆయన మాట మీద నమ్మకంతో సభను అడ్డుకోవడంలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచన మేరకు ఈ అంశాన్ని తాజాగా సభలో లేవనెత్తాల్సి వచ్చిందని, అందువల్లనే వాయిదా తీర్మానాన్ని ఇచ్చామన్నారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ అవకాశం ఇవ్వడంతో ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు. చర్చలో భాగంగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై కూడా ఇదే తరహా హామీలు ఇస్తే తమ పార్టీ నుంచి నిరసనలు తప్పవని అన్నారు.
కాగా, ఉమ్మడి హైకోర్టులో 49 మంది జడ్జీ పోస్టులు ఉన్నాయని, ప్రస్తుతం 23 మందే ఉన్నారని, మిగిలినవన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. హైకోర్టు ఉమ్మడిగానే ఉంటే తెలంగాణ వాళ్లమని చెప్పి ఆ స్థానాల్లో ఆంధ్ర న్యాయమూర్తులు వచ్చే ప్రమాదం ఉందని ఉందన్నారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏపీ హైకోర్టుకు అవసరమైన భవనాన్ని, మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని గతంలో ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనే హైకోర్టు నిర్మిస్తామని చెప్తూ హైకోర్టు విభజనను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications