ఏపీకి ఆటోమొబైల్ దిగ్గజం: కిక్కిరిస్తున్న హైద్రాబాద్.. ఇక వరంగల్కు..
హైదరాబాద్/విజయవాడ: ఏపీలో రూ.2వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు స్పెయిన్కు చెందిన అప్లాజ్ ఇడియాడా కంపెనీ ముందుకొచ్చింది. భారత్కు చెందిన ఎస్ బాలన్ గ్రూప్తో కలిసి రాష్ట్రంలో ఆటోమేటివ్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.
ఈ రెండు గ్రూపుల ప్రతినిధులు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ప్రాజెక్టు వివరాలు చర్చించారు. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఈ వాహన పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ఈ తరహా వాహన పరీక్షా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే మొదలు.
మరో స్టార్టప్ కేంద్రం: కెసిఆర్
ఇటీవల ప్రారంభించిన టీ-హబ్ మంచి ఫలితాలిస్తోందని, ఇదే తరహాలో మరో ఐటీ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలని ఐటీశాఖ కార్యదర్శిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం ఆదేశించారు. ఇందుకు ప్రభుత్వం నిధులిస్తుందని చెప్పారు.య
హైదరాబాద్ నగరం ఐటీ సంస్థలతో కిక్కిరిసిపోతోందని, ఇకపై వచ్చే కొత్త కంపెనీలను వరంగల్కు తరలించి, ప్రోత్సహించాలని సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఐటీశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావడం మంచి పరిణామం అన్నారు. ఐటీ సహా ఇతర కంపెనీలు సామాజికబాధ్యతగా ఇచ్చే నిధులన్నింటిని ఒకేచోటకు చేర్చి ప్రభుత్వ ప్రాధామ్యాలను బట్టి ఖర్చుచేయాలన్నారు.