తెలంగాణాలో మరో కొత్త చట్టం.. ముసాయిదా బిల్లు సిద్ధం; అసెంబ్లీలో ఎప్పుడంటే!!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇందుకోసం ఇప్పటికే అసెంబ్లీలో బిల్లు పెట్టటం కోసం ముసాయిదా కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం జరగనున్న బడ్జెట్ సమావేశాలలో కాకుండా, ఆపై జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తుంది.

తెలంగాణాలో నీటిపారుదలకు కొత్త చట్టం
తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించి 18 వేర్వేరు చట్టాలను కలిపి ఒక కొత్త సమీకృత నీటిపారుదల చట్టాన్ని తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ముసాయిదాను కూడా సిద్ధం చేశామని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. నీటిపారుదల శాఖపై ఈఎన్సీ మురళీధర్ తో కలిసి జల సౌధలో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన నీటిపారుదల సమీకృత చట్టం గురించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సమీకృత నీటిపారుదల చట్టం అవసరం ఉందని పేర్కొన్నారు.

పాత చట్టాలు ఇప్పటి అవసరాలకు తగ్గట్టు లేనందునే కొత్త చట్టం
నిజం కాలంనాటి ఫసలి చట్టం 1935 అమలులో ఉందని పేర్కొన్న ఆయన, ఆ చట్టంలో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అనేక అంశాలు లేవని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో సమూలమైన మార్పులు చోటు చేసుకోవడంతో కొత్త చట్టం అనివార్యమైందని నీటిపారుదల ప్రత్యేక సి ఎస్ రజత్ కుమార్ వెల్లడించారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతో పాటు, నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ నిబంధనలలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నీటిపారుదల ఆస్తుల పరిరక్షణకు, నిర్వహణకు, నీటి భద్రత అంశాలకు సంబంధించి పాత చట్టాల్లో ఎటువంటి నిబంధనలు లేవని, అందుకే కొత్త చట్టంలో వాటిపై ఖచ్చితమైన నిబంధనలను రూపొందించి ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని ఆయన తెలిపారు.

కృష్ణా జలాల వివాదం విషయంలో తెలంగాణా ఏం చేస్తుందంటే
ఇక ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న కృష్ణా జలాల పంపకాల వివాదం పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల వివాదం అంతర్రాష్ట్ర జలాల వివాద చట్టం 1956 లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్ కుమార్ వెల్లడించారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యత ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణ ట్రిబ్యునల్ 2 కు అప్పగించాలా? లేదా కొత్త ట్రిబ్యునల్ కు అప్పగించాలా? అన్న అంశం పైన న్యాయపరమైన సలహాల మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్ కౌన్సిల్ భేటీలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.

గోదావరీ నదీ జలాల విషయంలోనూ తెలంగాణా నిర్ణయం
అందుకే ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి ఆలోచిస్తున్నామని, ఇక ఈ విషయంలో కేంద్ర నిర్ణయం తీసుకోకపోతే అప్పుడు సుప్రీంకోర్టుని తాము ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ఇక గోదావరి నదీజలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలన్న ఏపీ డిమాండ్ పై తమకు కూడా అభ్యంతరం లేదన్నారు. ఏదేమైనా తాజాగా జరిపిన నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశం వేదికగా నీటిపారుదల వ్యవస్థకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్టు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.












Click it and Unblock the Notifications