తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా.. నిజామాబాద్ అర్బన్ గణేశ్ గుప్తాకు పాజిటివ్.. ఆ కాంటాక్ట్ వల్లే?
లాక్ డౌన్ సడలింపుల తర్వాత కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ సోషల్ డిస్టెన్సింగ్ నియమాలు పాటించని కారణంగా ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి కాటుకు గురవుతున్నారు. ఇప్పటికే జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు వైరస్ సోకగా.. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఆయన ద్వారానే?
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు హైదరాబాద్ లో జరిగిన ఓ భేటీలో వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినట్లు తెలుస్తోంది. సదరు భేటీలో జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గోవర్దన్ కలిసినట్లు సమాచారం. ఆ సమావేశంలో మరో ఎమ్మెల్యే సైతం ఈ ఇద్దరితో చనువుగా తిరిగినా ఆయన ఎవరనేది వెల్లడికాలేదు. సదరు భేటీ తర్వాత కొద్ది రోజులకే ముత్తిరెడ్డి అస్వస్థతకు గురికావడం, కరోనా పాజిటివ్ గా తేలడం, రెండ్రోజుల వ్యవధిలోనే బాజిరెడ్డికి సైతం వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడం జరిగింది. ఇప్పుడు గణేశ్ గుప్తాకు కూడా గోవర్దన్ తో కాంటాక్ట్ వల్లే వైరస్ సోకినట్లు వినికిడి.

హైదరాబాద్ లో చికిత్స..
కరోనా సోకిన ముగ్గురు ఎమ్మెల్యేలూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవాళ్లేకావడం గమనార్హం. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దంపతులు ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయన వల్ల వైరస్ బారినపడ్డ పనివాళ్లిద్దరిని గాంధీకి తరలించారు. రెండో ఎమ్మెల్యే బాజిరెడ్డి సైతం నిజామాబాద్ నుంచి ఒంటరిగా కారులో వచ్చి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడం తెలిసిందే.

గణేశ్ గుప్తా కూడా..
మిగతా ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలాగే మూడో ఎమ్మెల్యే గణేశ్ కూడా గాంధీలో కాకుండా మరో చోట చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు వైద్య పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరారు. ఎమ్మెల్యే కుటుంబీకులు, అనుచరులు, ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని క్వారంటైన్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించారు.

డేంజర్ లో ప్రతినిధులు..
కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడి ధైర్యం చెప్పే ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా వైరస్ కాటుకు గురవుతుండటం, వాళ్ల సిబ్బందితోపాటు పనివాళ్లు కూడా కరోనా కోరల్లో చిక్కుకుంటుండటం కలకలం రేపుతున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యేక అధికారికి సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత సహాయకుడికి, మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్కు కూడా కోవిడ్-19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీళ్లుకాకుండా అత్యవసర విభాగాల్లో పనిచేస్తోన్న డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టులు కూడా పదుల సంఖ్యలో వైరస్ బారినపడటం విచారకరం.












Click it and Unblock the Notifications