'తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అంటే ముఖాన ఉమ్మేస్తారు'
హైదరాబాద్: పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రవ్యాఖ్యలు చేశారు. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్తో పాటు ఆయన మద్దతుదారులు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
సీపీఐకి చెందిన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సహా ఏ రాజకీయ నాయకుడైనా పార్టీలు ఫిరాయించే సందర్భంలో తేలు కుట్టిన దొంగల్లా మూసుకుపోవాలని ఆయన అన్నారు. అంతేతప్ప.. తాము అభివృద్ధి కోసమే పార్టీ మారానని దొంగ కొంగ జపం చేసినా, తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అంటే ముఖాన ఉమ్మేస్తారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్, దేవరకొండ సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఎమ్మెల్యే భాస్కర్రావులు తాము టీఆర్ఎస్లో చేరుతున్నామని మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ దేవరకొండ నియోజకవర్గంతోపాటు నల్లగొండ జిల్లా అభివృద్ది కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ తెలిపారు.

దేవరకొండ నియోజకవర్గం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ. మూడు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ది జరగాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాను ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి టీఆర్ఎస్లో చేరుతున్నానన్నారు.
సీఎం కేసీఆర్ను తానెప్పుడూ కలవలేదన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. డిండి పథకం విషయంలో ప్రభుత్వానికి సహకరి స్తామన్నారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామం
ఇతర పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్లో చేరడం శుభపరిణామమని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం నేరుడు గొమ్ములో నాయిని పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు చేస్తున్నమని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ర్టాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ఉద్ఘాటించారు. సర్వేలు కూడా కేసీఆర్కు నెంబర్వన్ సీఎం అని కితాబిచ్చాయని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications