బిజెపిని తిట్టొద్దు: మోడీ వ్యూహాన్ని బాబు పసిగట్టారా, తప్పని పరిస్థితా?
విజయవాడ: ప్రత్యేక హోదా విషయంలో బిజెపి ఏపీకి షాక్ ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆచితూచి స్పందిస్తున్నారు. కేంద్రం పైన ఓ వైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, మరోవైపు పార్టీ సీనియర్లకు, ఇతర నేతలకు మాత్రం పలు సూచనలు చేస్తున్నారు.
చంద్రబాబు శుక్రవారం నాడు పార్టీ సీనియర్లు, ఇతర నేతలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక హోదా, తాజా పరిస్థితుల పైన ఆయన చర్చించారు. హోదా పైన ప్రభుత్వం వైఖరిని ఆయన వారికి స్పష్టం చేశారు. హోదా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని ప్రజలకు చెప్పాలని సూచించారు.
కష్టకాలంలోను ఏపీ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పడుతున్న తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ పైన వ్యక్తిగత విమర్శలకు తావు ఇవ్వవద్దని హతవు పలికారు. తద్వారా బిజెపిపై ఇంకా వేచి చూసే ధోరణి అవలంభించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రులు చేసిన ప్రకటన పైన తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. బిజెపి ఏపీ ప్రజలను మోసం చేసిందని, మతతత్వ పార్టీని ప్రజలు అంగీకరించరని.. ఇలా తీవ్రస్థాయిలో బిజెపి పైన దుమ్మెత్తిపోశారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి వచ్చింది.
దీంతో ఆయన సీనియర్ నేతలకు దిశానిర్దేశనం చేశారు. బిజెపిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీది తప్పు అని, దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చంద్రబాబు వారికి సూచించారు.
తప్పనిసరి పరిస్థితుల్లోనేనా?
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రమంత్రులు తేల్చి చెప్పారు. దీంతో విపక్షాలు సహా టిడిపి నేతలు కూడా భగ్గుమన్నారు. ఓ సమయంలో చంద్రబాబు కూడా బిజెపి పైన తన ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, పరుషపదజాలం ఉపయోగించలేదు. టిడిపి నేతలు మాత్రం బిజెపిపై పరుషంగా మాట్లాడుతున్నారు.
దీంతో, చంద్రబాబు రంగంలోకి దిగి బిజెపిపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని హితవు పలికారు. అయితే, చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో తగ్గుతున్నారా? లేక బీజేపీపై ఇంకా నమ్మకంతో వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి అలా ప్రకటన చేసి ఉంటుందని, వచ్చే ఎన్నికల నాటికి ఇవ్వవచ్చునని, హోదా క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి, టిడిపికి వెళ్లకుండా చేసి.. ఆ తర్వాత ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
దీనిని చంద్రబాబు గుర్తించే, బిజెపి పైన వ్యక్తిగత విమర్శలకు తావివ్వవద్దని సూచించి ఉంటారా అనే చర్చ సాగుతోంది. తాము పూర్తిగా దూరం జరిగాక.. ఏపీలో ఓ వైపు పార్టీని బలోపేతం చేస్తూ, ఎన్నికల సమయానికి హోదాపై ప్రకటన చేస్తే టిడిపికి భారీ నష్టం. దీనిని పసిగట్టినందువల్లే చంద్రబాబు బిజెపిపై నోరు జారవద్దని సూచిస్తున్నారా అనే చర్చ సాగుతోంది.
అదే సమయంలో, హోదా ఇవ్వమని తేల్చి వేశాక.. కొత్త రాష్ట్రమైన ఏపీకి నిధులు, లోటు బడ్జెట్, రాజధాని.. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి కేంద్రం సహకారం తప్పనిసరి. ఆ కారణంగా కూడా చంద్రబాబు సూచించి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు.