కేసీఆర్ హిట్లిస్ట్ లో ఏపీ; అక్కడ రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయన్న మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. రేపు దసరా పండుగ రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్న కేసీఆర్, ఆపై దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని జాతీయ పార్టీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు మూడు రాష్ట్రాల పైన ఫోకస్ చేస్తున్న కెసిఆర్ తమ హిట్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉందని వెల్లడించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా సీట్లు ఉన్నాయని వాటిలో 50 నుండి 60 స్థానాలు గెలుస్తామని కెసిఆర్ ధీమాతో ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలలో మార్పు : ఎర్రబెల్లి
తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుతో ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాలలో సైతం మార్పులు వస్తాయని వెల్లడించారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లోని వివిధ పార్టీల లో ఉన్న అసంతృప్తులు కెసిఆర్ పార్టీతో బయటకు వస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కెసిఆర్ జాతీయ పార్టీతో మార్పు కచ్చితంగా వస్తుందని పేర్కొన్న మంత్రి ఎర్రబెల్లి రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ గెలిచినా జాతీయ పార్టీ లక్ష్యం చేరుకున్నట్టే అని స్పష్టం చేశారు.

ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టబోతున్న కేసీఆర్
ఇక కెసిఆర్ ఆలోచన, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టబోతున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేసీఆర్ ఏపీ రాజకీయం ఏ పార్టీ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ పెడుతున్న జాతీయ పార్టీ పై వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సీఎం కేసీఆర్ పెడుతున్న పార్టీకి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనిపించడం లేదు. ఇక సీఎం కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాల సీఎంలతో జాతీయ పార్టీ పై చర్చించినప్పటికీ, ఏపీ సీఎం తో జాతీయ పార్టీ విషయంలో కానీ, మరే ఇతర అంశాల పైన కానీ చర్చించిన దాఖలాలు కూడా లేవు.

ఏపీ ప్రభుత్వానికి తెలంగాణా ప్రభుత్వానికి మధ్య లేని సయోధ్య
ఇక ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసిపి తమ మద్దతును బీజేపీకి ప్రకటించింది. దీంతో బీజేపీకి సన్నిహితంగా ఉంటున్న వైసిపితో కెసిఆర్ ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఇద్దరూ స్నేహ బంధం కొనసాగించినా, క్రమంగా ఇరు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అప్పటి నుండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగానే ఉంటున్నారు. జల వివాదాల విషయంలో కోర్టు మెట్లెక్కి మరీ ఘర్షణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత పెరుగుతుంది, సయోధ్య కుదిరింది అన్న పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో కెసిఆర్ ఏపీ రాజకీయాల్లో వేలు పెడితే వైసిపి కూడా నష్టం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఏపీ ప్రజలు తనను ఆదరిస్తారని నమ్ముతున్న కేసీఆర్ .. జగన్ చెక్ పెడతారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తనకు ప్రజల నుంచి మద్దతు దక్కుతుందని, తమ పార్టీ వైపు ఆసక్తి చూపించే రాజకీయ నాయకులు ఉన్నారని కెసిఆర్ బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏపీపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలలో కెసిఆర్ పార్టీ పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏపీ లో కెసిఆర్ పాలిటిక్స్ కు చెక్ పెట్టడానికి ఏం చేస్తారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications