ఏపీలో టీఆర్ఎస్ శాఖ పెట్టమంటున్నారు: కేటీఆర్, ఆ ఘనత ఆయనదే: కవిత
హైదరాబాద్/ఖమ్మం: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని ఆంధ్రా ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం అన్నారు. ఏపీలో కూడా టీఆర్ఎస్ శాఖ పెట్టాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
తెలంగాణ భేష్, దూసుకెళ్తోంది: కేసీఆర్ ప్రభుత్వంపై మన్మోహన్ ప్రశంస
ఆయన ఖమ్మం జిల్లాలోని మధిరలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మధిర ఎమ్మెల్యే ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ప్రతిపక్షంలో లేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటే బడుగు బలహీన వర్గాలు చల్లగా ఉంటాయన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎప్పుడు మధిరకు నిధులు కేటాయించలేదన్నారు.
అందరూ ఆత్మగౌరవంతో
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మధిర అభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించినట్లు కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తోందన్నారు. అందరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు.
నాటి కాంగ్రెస్ వేరు, నేటి కాంగ్రెస్ వేరు
కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 67 ఏళ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ది మోసాల చరిత్ర అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్ వేరు, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ వేరు అన్నారు. దేశం అబ్బురపడేలా తెలంగాణ అభివృద్ధి జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఆ ఘనత సుదర్శన్ రెడ్డిదే
ఆంధ్రా వారికి గోదావరి నీళ్లు మళ్లించిన ఘనత సుదర్శన్ రెడ్డిదేనని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత వేరుగా విమర్శించారు. ఆమె బోధన్ సభలో మాట్లాడారు. బోధన్ పట్టణానికి రూ.80 కోట్లు కేటాయించామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతులను రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటామన్నారు.
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీష్ రావు అన్నారు. బోధన్ నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. బోధన్ నియోజకవర్గానికి బినోల లిఫ్ట్, కల్దుర్తి లిఫ్టులు మంజూరు చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతిని సీడబ్ల్యూసీ అభినందించిందని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరం నీళ్లు ఇస్తామన్నారు.