ఏపీ-తెలంగాణ మధ్య డేటా యుద్ధం!: హైదరాబాద్‌లో హైడ్రామా, అసలేం జరిగిందంటే?

హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య డేటా వార్ ముదురుతోంది. తమ పార్టీ డేటాను వైసీపీకి అందచేసే కుట్ర తెరాస చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థలను అడ్డుకునే కుట్రలో భాగమే ఐటీ కంపెనీలపై దాడులు అని చెబుతోంది. సభ్యత్వ నమోదు నుంచి క్షేత్రస్థాయి నేతల పనితీరు వరకు సమీక్షకు టీడీపీ టెక్నాలజీని వాడుతోంది.

అయితే ఏపీలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని తెలంగాణలోని ఓ కంపెనీ తీసుకొని ఓట్ల తొలగింపు కార్యక్రమం చేస్తోందని సైబరాబాద్ పోలీసులకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసారు. ఆయన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు పలుచోట్ల సోదాలు చేస్తున్నారు. పలువురు ఐటీ కంపెనీల యాజమాన్యాలను అదుపులోకి తీసుకున్నారు. విజయసాయి రెడ్డి ఫిర్యాదు, తెలంగాణ పోలీసుు సోదాలతో వైసీపీ - తెరాస కుట్ర బయటపడిందని టీడీపీ ఆరోపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం

తెలుగు రాష్ట్రాల మధ్య డేటా యుద్ధం

హైదరాబాదులోని కూకట్‌పల్లి ఫార్చ్యూన్‌ఫిల్డ్ దగ్గర ఆదివారం హైడ్రామా చోటు చేసుకుంది. తమ డేటా చోరీ చేశారని ఐటీ కంపెనీకి చెందిన లోకేశ్వర్ రెడ్డి... మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఏపీ పోలీసులు రంగంలోకి దిగడంతో తెలంగాణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఏపీ పోలీసులు లోకేశ్వర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

అసలు ఏం జరిగిందంటే?

టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో సైబరాబాద్‌ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు చేశారు. కొన్ని హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు చెందిన ప్రతినిధులను అదుపులోకి తీసుకొని, విచారించారు. దానిపై ఏపీ నుంచి పోలీసులు మాదాపూర్‌కు రావడంతో ఈ సోదాల వ్యవహారం రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. టీడీపీకి ఐటీ సేవలందిస్తున్న సేవామిత్ర మొబైల్‌ యాప్‌లో ఏపీకి చెందిన మూడు కోట్ల మంది ఓటర్ల జాబితా ఉందని విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌ సంస్థ టీడీపీకి యాప్‌ తయారు చేసి ఇచ్చిందని, ఇందులో ఓటర్లు, వారి ఆధార్‌ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే ప్రతి టీడీపీ కార్యకర్తకూ ఈ సమాచారం అంతా అందుబాటులోకి వస్తుందన్నారు. ఇదే ఐటీ సంస్థ కూకట్‌పల్లిలోని మరో కంపెనీ నుంచి వివరాలను సేకరించిందని వైసీపీ ప్రతినిధి తుమ్మల లోకేశ్వర రెడ్డి మాదాపూర్‌ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. టీడీపీకి అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో సేవామిత్ర యాప్‌ వివరాలున్నాయన్నారు.

 సెల్‌ఫోన్ ఆధారిత సేవలు

సెల్‌ఫోన్ ఆధారిత సేవలు

ఏపీ ప్రభుత్వం సెల్‌ఫోన్ ఆధారిత సేవలను తమకు అందించాలని విశాఖపట్నంలో ఉంటున్న బ్లూ ఫ్రాగ్‌ మొబైల్‌ టెక్నాలజీస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ను కోరిందని, ఈ మేరకు ఆ సంస్థ ఏపీ ప్రభుత్వం నుంచి జనాభా వివరాలు, భౌగోళిక ప్రాంతాలు, ప్రజల ఆధార్‌ కార్డులు, ఏపీ స్మార్ట్‌ పల్స్‌ సర్వే, స్టేట్‌ రెసిడెంట్‌ డేటా హబ్‌తో పాటు హైదరాబాద్‌లో ఉంటున్న కావ్య డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ నుంచి ప్రజా సాధికార వేదిక వివరాలను తీసుకుందని లోకేశ్వర్ రెడ్డి పోలీసులకు చెప్పారు. ఈ డేటా మొత్తాన్ని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ ఇండియా సంస్థ వినియోగిస్తుందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ఉంచుకోవద్దని, ఇందుకు విరుద్ధంగా టీడీపీ వ్వయహరిస్తోందని, వీటి సాయంతో టీడీపీ నాయకులు 2014లో ఓటరు జాబితాలో ఉన్న పేర్లను 2019లో తొలగించారని ఆరోపించారు.

ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు

ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు

వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ ఇండియ్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో శనివారం సాయంత్రం తనిఖీలు చేశారు. సంస్థ ప్రతినిధుల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా కొన్ని హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంలో ఆ ఐటీ సంస్థపై కేసు నమోదు చేశామని, ప్రాథమిక విచారణ చేపట్టామని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ విసి సజ్జనార్‌ చెప్పారు. మరోవైపు, ఐటీ గ్రిడ్ కార్యాలయానికి శనివారం రాత్రి ఏపీ పోలీసులు వచ్చారు. ఇక్కడ పని చేస్తున్న భాస్కరరావు అదృశ్యమయ్యారని, కుటుంబ సభ్యులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన గుంటూరు అర్బన్‌ పోలీసులు ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. గుంటూరు డీఎస్పీ ఆధ్వర్యంలో బృందాలను పంపించారు. ఐటీ గ్రిడ్‌ కార్యాలయంలో తనిఖీల నిమిత్తం వచ్చినట్లు మాదాపూర్‌ పోలీసులకు వారు తెలిపారు. ఏపీ ఓటర్లకు సంబంధించి వైసీపీ గతంలో ఫిర్యాదు చేసిందని, దీనికి సంబంధించి భాస్కర్‌ను విచారించిన అనంతరం అప్పగిస్తామని మాదాపూర్‌ పోలీసులు ఏపీ పోలీసులకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+