అవి అరెస్టులా.?బీజేపిని కేసీఆర్ ఎవరెస్టు ఎక్కించడమా.?సందేహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.!
హైదరాబాద్ : సాగు చట్టాలు, రైతు సమస్యలు, ధాన్యం కొనుగోలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతు బలిదానాలు, ఉపాద్యాయ బదిలీలు.. అన్నీ అంశాలు ఒక్క అరెస్టుతో ఔట్.. వన్ షాట్ టెన్ ఇష్యూస్ ఫసక్.. అది సీఎం చంద్రశేఖర్ రావు అంటే.! అనే ఘాటు వ్యాఖ్యలను చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. కరోనా కారణం చూపించి బండి సంజయ్ దీక్షను భగ్నం చేసి రాష్ట్ర ప్రజల దృష్టిని అనూహ్యంగా మళ్లించేందుకు సీఎం చంద్రశేఖర్ రావు ఆడుతున్న, పోలీసులతో ఆడిస్తున్న వినూత్న డ్రామా అని కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తోంది. బీజేపి, టీఆర్ఎస్ మద్య నాటకాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయని ఎద్దేవా చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్.
బీజేపీ టీఆర్ఎస్ డ్రామాలు.. రక్తికడుతున్న అరెస్టు నాటకాలన్న రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో బీజేపి, టీఆర్ఎస్ మద్య చోటుచేసుకున్న అరెస్టు రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ లోతుగా విశ్లేషిస్తోంది. టీఆర్ఎస్, బీజేపి డ్రామాలకు మొన్నటి వరకూ ఢిల్లీ వేదిక కాగా ఇప్పుడు అవే డ్రామాలను తెలంగాణ వేదిక మీదకు మార్చారని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. బండి సంజయ్ అరెస్టు పార్ట్ వన్ అని, పార్ట్ టూ బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను అదుపులోకి తీసుకోవడం అని రేవంత్ ట్వీట్ చేసారు. కమలం, గులాబీ మద్య మరింత ఆసక్తికర సన్నివేశాల కోసం వేచి చూడండి అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సమస్యలనుండి ప్రజల దృష్టి మళ్లించడమే.. చిన్న విషయాలకు అరెస్టులెందుకన్న కాంగ్రెస్
తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పరిగణిస్తోంది. వరిధాన్యం, ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యల నుండి అకస్మాత్తుగా ఎందుకు అరెస్టుల రాజకీయానికి తెరలేపిందనే అంశంపై ఆరా తీస్తోంది కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఆదివారం రాత్రి జనజాగరణ కార్యక్రమాన్ని భగ్నం చేసి, బండి సంజయ్ కుమార్ ను అరెస్టు చేయడంలో అంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని, కోవిడ్ నిబంధనలను ముందుపెట్టి, బీజేపికి ప్రాచూర్యం కలిగించే కార్యక్రమాలకు చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టారని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ కు ప్రజాధరణ.. నిలువరించేందుకు కేసీఆర్ కుట్ర అంటున్న టీపిసిసి
అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయని, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీకి గ్రామస్థాయిలో ప్రజాధరణ అనూహ్యంగా పెరుగుతున్నట్టు నిఘావర్గాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు విశ్వసనీయ సమాచారం అందినట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తోంది. అంతే కాకుండా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్టు, సుమారు 35నుండి 55మంది ఎమ్మెల్యేలు రాబోవు ఎన్నికల్లో బొక్కబోర్లా పడే పరిస్థితిలు నెలకొన్న అంశాలను నిఘా వర్గాలు చంద్రశేఖర్ రావుకు నివేదిక అందించినట్టు కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తోంది.
టీఆర్ఎస్ బీజేపి కొనసాగింపు నాటకాలు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న తెలంగాణ కాంగ్రెస్
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజాధరణ లభిస్తే గులాబీ పార్టీ అగమ్యగోచరంలో పడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితులను మొగ్గలోనే తుంచేసేందుకు చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు మొదలు పెట్టారని, అందులో భాగంగా బీజేపి పార్టీకి తగినంత ప్రాచూర్యం కలిగిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రజా మద్దత్తు బీజేపికి వస్తుందన్న అభిప్రాయంతో బీజేపిని లైమ్ లైట్ ఉంచేందుకు చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశ్లేషిస్తోంది. అందులో భాగంగానే బండి సంజయ్ అరెస్ట్, 14రోజుల రిమాండ్, ఢిల్లీ నుండి జేపి నడ్డా తెలంగాణకు రావడం వంటి పరిణామాలు చురుగ్గా చోటుచేసుకుంటున్నాయని కాంగ్రెస్ అభివర్ణిస్తోంది.