ఆర్మూరు రైతుల రిమాండ్ ... ఉధృతమవుతున్న పసుపు ,ఎర్రజొన్న రైతుల ఆందోళన
పసుపు, ఎర్ర జొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. గిట్టుబాటు ధర ప్రకటించి బైబ్యాక్ ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు ఆర్మూరు రైతులు. దీంతో ఆందోళన చేస్తున్న ఆర్మూరు రైతులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆర్మూరు రైతులపై పోలీసుల చర్యకు నిరసనగా నేడు బందుకు పిలుపునిచ్చారు.
పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఇరవైఒక్క మంది రైతుల పై కేసు నమోదు
తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు గా వారిపై లాఠీఛార్జ్ చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఏడుగురు రైతులపై కేసులు నమోదు చేయడంతో పాటుగా జైలుకు తరలించారు. మొత్తం 60 మందిని బైండోవర్ చేసిన పోలీసులు, 21 మందిపై కేసులు నమోదు చేశారు. పసుపు, ఎర్రజొన్న రైతులు గత 22 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు మాత్రం అడుగడుగునా వారి ఆందోళనను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురిని రిమాండ్ కు తరలించారు. రైతుల కుటుంబ సభ్యులు బెయిల్ కోసం ప్రయత్నం చేసినా ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో టిఆర్ఎస్ ప్రభుత్వం పై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఆర్మూరు బంద్
రైతులపై కేసులు నమోదుచేసి జైలుకు పంపించిన పోలీసుల తీరుకు, ప్రభుత్వ విధానానికి నిరసనగా నేడు ఆర్మూరు బందుకు పిలుపునిచ్చారు. దీంతో ఈ రోజు ఆర్మూర్ లో బంద్ కొనసాగుతోంది. ఆర్మూరు రైతుల ఆందోళన రోజురోజుకి ఉధృతమవుతున్న అప్పటికీ ప్రభుత్వం మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. దీంతో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు సైతం అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
22 రోజులుగా కొనసాగుతున్న ఆర్మూరు రైతుల ఆందోళన
పసుపు, ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకపోగా, వారి పైన కేసులు నమోదు చేయడం పైన ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. రైతు సంక్షేమం కోసం పని చేయాల్సిన ప్రభుత్వం గత ఇరవై రెండు రోజులుగా రైతులు విభిన్న రీతులలో తమ నిరసనను తెలియ చేస్తున్నా , రోడ్లపైనే నిద్రించినా, జాతీయ రహదారి దిగ్బంధం నిర్వహించినా , రోడ్ల మీదే కుటుంబాలతో వంటావార్పు చేసి జీవించినా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం స్పందించే వరకు, తమ సమస్య పరిష్కరించే వరకు పోరాటం సాగించాలని నిర్ణయించుకున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రైతులు 1000 మంది రైతులతో లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి నామినేషన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరి తమ డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు.
కొందరు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారు... నిజామాబాద్ ఎంపీ కవిత
పసుపు ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఆందోళన పై స్పందించిన నిజామాబాద్ ఎంపీ కవిత ప్రభుత్వ రైతు సంక్షేమం కోసం ఎంతో చేస్తుందని చెప్పుకొచ్చారు. కొందరు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఎర్ర జొన్న రైతు ల సమస్య పరిష్కరించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె చెప్పారు. అయితే రైతుల పైన జరుగుతున్న నిర్బంధాల పైన కానీ, రైతుల పైన కేసులు నమోదు చేయడం పైన గాని ఎంపీ కవిత స్పందించలేదు.
నిర్బంధించినా సరే పోరాటం చేస్తాం.. తెగేసి చెప్తున్న ఆర్మూరు రైతులు
ఏది ఏమైనా ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్ర జొన్న సాగుచేసిన రైతులు పోరాటం చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రైతుల పైన నిర్బంధానికి దిగుతోంది. ఎవరెన్ని చేసినా తమ సమస్య పరిష్కరించుకునే వరకు ఈ పోరాటం సాగుతుందని ఆర్మూరు రైతులు మాత్రం తెగేసి చెబుతున్నారు.