ఆమె ఆశ ఆవిరి, బిస్కెట్ ప్యాకెట్ చేజారింది: పడవల్లో సాయం (పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరంలోని నిజాంపేట బండారి లేఅవుట్ కాలనీలో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపడానికి కృషి చేస్తామని మంత్రి మహేందర్ రెడ్డి ఆదివారం నాడు హామీ నిచ్చారు. ముంపు బారిన పడిన అపార్టుమెంట్లను ఆయన సందర్శించారు.
అనంతరం తురక చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తురక చెరువు నుంచి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టాక.. ప్రజలు, అధికారులను సమన్వయపరిచి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సెల్లార్లలో నిండిని నీటిని ప్రభుత్వమే తోడిస్తోందన్నారు. కాలిపోయిన విద్యుత్తు మీటర్ల స్థానంలో ఉచితంగా కొత్తవి ఏర్పాటు చేయిస్తామన్నారు.
కిందపడిన బిస్కట్ ప్యాకెట్.. మహిళ బాధ
నగరంలో భారీగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు, నిజాంపేటలోని బండారి లే అవుట్ వాసులు, ఆల్విన్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఆల్విన్ కాలనీ ధరణి నగర్ అపార్టుమెంట్ వాసులు.. ఎవరు వస్తున్నా తమకు ఏదన్నా తినేందుకు ఇవ్వకపోతారా అని ఆశతో ఎదురు చూస్తున్నారు.
ఆదివారం వరద బాధితులకు బిస్కట్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంచారు. కిందకు వచ్చి తీసుకునే అవకాశం లేదు. దీంతో విసిరిన ప్యాకెట్లను అందుకునేందుకు మహిళలు అవస్థలు పడుతున్నారు. ఓ చోట అపార్టుమెంట్ వద్ద బిస్కట్ ప్యాకెట్ విసిరారు. దానిని ఆ మహిళ పట్టుకునేందుకు ప్రయత్నించింది. అది చేజారడంతో తీవ్రంగా బాధపడింది.

కోలుకుంటున్న హైదరాబాద్
హైదరాబాదులో కురిసిన భారీ, అతి భారీ వర్షాల నుంచి నగరం క్రమంగా కోలుకుంటోంది. భారీ వర్షాలతో శివారులోని నిజాంపేట, హకీంపేట, అల్వాల్ ప్రాంతాలతో పాటు నగరంలోని బేగంపేట, అల్లంతోట బావి, వడ్డెర బస్తీ వంటి ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిన విషయం తెలిసిందే.

సైన్యం, ఎన్డీఆర్ఎఫ్తో మరింత ఊరట
వివిధ ప్రభుత్వ శాఖలు చేపట్టిన సహాయక చర్యలతో పాటు శనివారం సైన్యాన్ని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగటంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఆదివారం కూడా సైనికులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిజాంపేట, అల్వాల్, బేగంపేట, హకీంపేటల్లో సహాయక చర్యలు చేపట్టాయి.

పడవల్లో సాయం
ఎక్కువ నీరు నిలిచిన నిజాంపేటలోని పలుప్రాంతాల్లో బృందాలు పడవలలో ప్రయాణిస్తూ బాధితులకు ఆహార పొట్లాలు, పాలు, మంచినీరు వంటివి అందించారు. అంతేగాక, 21వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసినా, ఆదివారం వర్షం సైతం సెలవు పాటించటంతో సహాయక చర్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి.

ఆదివారం ఉపశమనం
ప్రధానంగా మరో అయిదు రోజుల పాటు నగరానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ వాతావరణ శాఖ ప్రకటించినా, ఆదివారం వర్షం కురవకపోవటంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు.

ఊపిరిపీల్చుకున్న హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాలు
అధికార యంత్రాంగం, హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలు ఊపరి పీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా సెలవులు ప్రకటించటంతో ఆదివారం కూడా నగర రహదార్లపై పెద్దగా రాకపోకలు కన్పించలేదు. హుస్సేన్ సాగర్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు రావటంతో దిగువ ప్రాంతాల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన కొంతవరకు తగ్గింది.

హుస్సేన్ సాగర్లోకి తగ్గిన ఇన్ ఫ్లో
4వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోతో సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరటంతో అధికారులు రెండురోజుల క్రితం ఔట్ఫ్లోను కూడా పెంచి, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ శనివారం అర్థరాత్రి నుంచి వర్షం కురవకపోవటంతో సాగర్లో నీరు ఎక్కువగా కిందకు విడుదల కావటంతో ప్రమాదం తొలగినట్టు అధికారులు భావిస్తున్నారు.

రోడ్లకు మరమ్మతులు
ప్రస్తుతం సాగర్కు ఇన్ఫ్లో తగ్గటంతో ఔట్ ఫ్లోను కూడా 3100 క్యూసెక్కులకు తగ్గించారు. వర్షం కురవకపోవటం, వాతావరణం కాస్త పొడిగా మారటంతో గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు జిహెచ్ఎంసి సిద్ధమవుతోంది.

పాల ప్యాకెట్లు
నిజాంపేట, ఆల్విన్ కాలనీ తదితర ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో స్వచ్చంధ సంస్థలు, ఆర్మీ, ఎన్డీఆర్ఎప్, ప్రభుత్వ యంత్రాంగాలు పడవల్లో వెళ్లి పాల ప్యాకెట్లు, బిస్కట్ పాకెట్లు, ఇతర ఆహార పదార్థాలు అందిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలవల్లే
ఇదిలా ఉండగా, హైదరాబాదులో అక్రమ నిర్మాణాల వల్లే భారీగా వరద నీరు వచ్చి, ఇళ్లు మునుగుతున్నాయి. సెలవు దినాల్లో, రాత్రి పూట భవనాలు నిర్మిస్తున్నారు. ఫుల్ట్యాంకు లెవల్(ఎఫ్టీఎల్) నిబంధనలు సైతం తుంగలో తొక్కుతున్నారు.

ఆదాయానికి గండి
ఫలితంగా జిహెచ్ఎంసి ఆదాయానికి బాగా గండి పడుతోంది. ఇళ్ల అనుమతుల బెటర్మెంట్ ఛార్జీలు, ప్లానింగ్ ఫీజులు, ఇతర ఆదాయాన్ని కోల్పోతోంది. అలాగే, ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడవలసి వస్తోంది. హైదరాబాదులో వేలాది అక్రమ నిర్మాణాలు జరిగాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications