తెలంగాణలో హోరా హోరీ, ఎవరికి ఎన్ని సీట్లు - తాజా సర్వే సంచలనం..!!
తెలంగాణలో మరి కొద్ది రోజులు ఎన్నికలు జరగనున్నాయి. గెలుపు పైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హ్యాట్రిక్ సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ వ్యూహం. బలం చాటాలనేది బీజేపీ నేతల ఆరాటం. ఈ సమయంలోనే టైమ్స్ నై తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు గెలిచే అవకాశం ఉందనే సర్వే రిపోర్ట్ వెల్లడించింది. అందులో అనూహ్య ఫలితాలు వచ్చాయి.
ఎవరికి ఎన్ని సీట్లు:టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కు 296 నుంచి 326 వరకు వస్తాయని అంచనా వేసింది. విపక్ష ఇండియా కూటమికి 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది.

కాంగ్రెస్ సొంతంగా 62 నుంచి 80 స్థానాలు గెలుచుకొనే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల పరంగా ఎన్డీఏకు 42.60 శాతం, ఇండియా కూటమికి 40.20 శాతం ఓట్లు లభిస్తాయని సర్వేలో వెల్లడించారు. ఏపీలో వైసీపీకి 24 లోక్ సభ సీట్ల వరకు వస్తాయని అంచనా వేసింది. ఇక, తెలంగాణలో సర్వేలో ఆసక్తి కర ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ కే మెజార్టీ ప్రజల మద్దతు ఉన్నట్లు సర్వే తేల్చింది.
బీఆర్ఎస్ వైపే మెజార్టీ :తెలంగాణలో అధికార బీఆర్ఎస్ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. బీజేపీకి తెలంగాణలో 2-3 సీట్లు, కాంగ్రెస్ కు 3-4 సీట్లు, ఇతరులకు ఒక సీటు వస్తుందని సర్వేలో తేల్చింది. బీఆర్ఎస్ కు 38.40 శాతం మంది ప్రజల మద్దతు ఉందని, ఎన్డీఏకు 24.30 శాతం, ఇండియా కూటమికి 29.90 శాతం , ఇతరులకు 7.40 శాతం మేర ఓట్లు వస్తాయని వెల్లడించింది. దీని ద్వారా మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు సాధిస్తామని సీఎం కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ తెలంగాణలో సీన్ మారిందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ప్రచారం చేస్తోంది.

అసెంబ్లీలో హోరా హోరీ:కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయ పోరు సాగింది. కానీ, అనూహ్యంగా బీజేపీ లో అంతర్గత సమస్యల కారణంగా వెనుకబడింది. ఇప్పుడు కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా ఎన్నికల యుద్దం మారినట్లు కనిపిస్తోంది. అదే విషయం ఇప్పుడు ఈ సర్వేలోనూ స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ తొలి స్థానంలో నిలవగా, ఇండియా కూటమి తరువాతి స్థానంలో ఉంది.
కాంగ్రెస్ తెలంగాణలో ఎన్డీఏ కంటే మెరుగైన స్థానంలో కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హోరా హోరీ పోరు తప్పదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల లోనే అభ్యర్ధుల ఎంపిక దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications