Rythu Bandhu: రెండో రోజు రైతుల ఖాతాల్లో రూ.758 కోట్లు జమ..
రైతు బంధు పైసాలు రైతుల ఖాతాల్లో జమ అవుతోంది. పదో విడతలో భాగంగా రెండో రోజు 22,45,137 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.758,19,25,476 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. 10వ విడత కింద 70.54 లక్షల మందికి రూ.5 వేల చొప్పున రూ.7,676.61 కోట్లను పంపిణీ చేయనుంది. 9 విడతల్లో రైతాంగానికి రూ.57,882 కోట్లు సాయం చేయగా, 10వ విడతతో కలిపి మొత్తం రూ.65,559.28 కోట్లు రైతుబంధు పథకానికి ఖర్చు చేసినట్లు అవుతుంది.
తొలి రోజు 1 వేల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.607 కోట్లు జమయ్యాయి. తొలిరోజున 1 ఎకరం వరకు ఉన్న 21,02,822 మంది రైతులకు ఇప్పటికే వారి అకౌంట్లలో రూ.607.32 కోట్లు జమ చేశారు. పదో విడత రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70.54 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
అయితే రైతు బంధు కింద సినీ యాక్టర్లకు, రాజకీయ నాయకులకు, పారిశ్రమికవేత్తలకు పైసాలు పంపిణీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు అంటే పేదలకు ఇవ్వాలని కానీ ధనవంతలకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడం సరైంది కాదని చెబుతున్నారు.
మంత్రి మల్లారెడ్డి రైతు బంధు కింద కోట్లు తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క గతంలోనే ఆరోపించారు. మల్లారెడ్డికి సంవత్సరానికి రూ.60 లక్షలు, నాలుగేళ్లలో రెండున్న కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు. కాగా రైతు బంధు నిధులు అందరి కంటే ముందు సిరిసిల్ల జిల్లా రైతులకు జమ అయ్యాయి.